Hyderabad | బంజారాహిల్స్, మార్చి 1 : కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములను కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసూరులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీలను కాపలాగా ఉంచారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీలచే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీకి, అశ్వినీ లే అవుట్కు మధ్యన పాలపిట్ట జంక్షన్కు ఎడమ వైపున షేక్పేట మండల సర్వే నంబర్ 403/పీలోని టీఎస్ నెం-1, బ్లాక్ ఎఫ్, వార్డు -9లో సుమారు 2ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్థలాన్ని డాట్ పబ్లికేషన్స్ అనే సంస్థకు కేటాయించగా నిర్ణీత సమయంలో దాన్ని వినియోగించుకోలేదు. దీంతో స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ల్యాండ్బ్యాంక్లో ఉంచి ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసులు పెండింగ్లో ఉన్నాయి.
సుమారు 200 కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేసిన కొంతమంది వ్యక్తులు బోగస్ పత్రాలు సృష్టించి గత కొన్నేళ్లుగా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. అభిషేక్ ఆవాలా అనే వ్యక్తితో పాటు మరికొంత మంది వ్యక్తులు తాము ఈ ప్లాట్లను కొనుగోలు చేశామంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థలంలోకి ప్రవేశించడంతో పాటు ఏకంగా బ్లూషీట్లు ఏర్పాటు చేశారు. తాత్కాలిక గదులు నిర్మించారు. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో కబ్జాలను పట్టించుకోలేదు. కాగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఖరీదైన స్థలం కబ్జాకు గురైందంటూ ఫిర్యాదులు రావడంతో గత ఏడాది డిసెంబర్ 12న షేక్పేట్ మండల తహసీల్దార్ అనితారెడ్డి ఆదేశాలతో సిబ్బంది రంగంలోకి దిగి జేసీబీల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం కబ్జాకు యత్నిస్తున్న అభిషేక్ ఆవాలా అనే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్పై క్రిమినల్ కేసు నమోదైయింది.
రెండు నెలల కిందట ప్రభుత్వ స్థలం ఆక్రమించేందుకు వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో తాజాగా మరోసారి అక్రమార్కులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే అక్కడున్న మూడు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడంతో పాటు ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ పేరుతో బోర్డులను ఏర్పాటు చేశారు. స్థలంలోకి ఎవరూ రాకుండా ప్రైవేటు వ్యక్తులను కాపలాగా ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు బిజిగా ఉంటారని, ఎన్నికలు ముగిసేలోగా తమ కబ్జా వ్యవహారం చక్కబెట్టుకోవాలని బావిస్తున్నట్లు తెలుస్తున్నది. సుమారు పదేళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెండెకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.