Khaja Mohijuddin | శనివారం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్పై జరిగిన హత్యాయత్నంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుండగుల చేతిలో హత్యకు గురైన ఖాజా మొయిజుద్దీన్ కేసు దర్యాప్తు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డీజీపీ సీవీ ఆనంద్కు లేఖ కూడా రాసింది.
ఇదిలా ఉంటే అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయిజుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మాటు వేసి నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో కారుతో గుద్ది హత్య చేసినట్టు గుర్తించారు. పోలీసులు దుండగుల కోసం ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు కొనసాగిస్తున్నారు.
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాటం..
హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొయిజుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన తండ్రి మొయిజుద్దీన్ హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అని అతని కుమారుడు ఫర్హాన్ ఆరోపించాడు.