అంబర్పేట, ఆగస్టు 19 : నల్లకుంట డివిజన్ న్యూ ఇందిరానగర్ బస్తీలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. న్యూ ఇందిరానగర్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగాగురువారం ఉదయం 5 గంటల సమయంలో ఆ ఏరియా జలమండలి మేనేజర్ రోహిత్తో కలిసి అక్కడ పర్యటించారు.
స్థానిక ప్రజలతో మాట్లాడి మంచినీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచినీరు, డ్రైనేజీకి సంబంధించిన సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోజు విడిచి రోజు వచ్చే మంచినీరు లోఫ్రెషర్తో వస్తుందన్నారు. అలాగే ఇక్కడ డ్రైనేజీ పైప్లైన్ వేయడం కోసం రోడ్డును తవ్వారని, పనులు పూర్తయినా తిరిగి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వీలైతంత త్వరగా కొత్త మంచినీటి పైప్లైన్ పనులు చేపట్టి మంచినీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపుతామన్నారు.
తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈ సంతోష్, జలమండలి మేనేజర్ రోహిత్, న్యూ ఇందిరానగర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకాష్, శంకర్, హన్మంతు, అంజిచారి, నరేష్, ఎం.యాదగిరి, బాలచందర్, జె.శ్రీనివాస్, బిజ్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.