CV Anand | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నేను సమస్యల్లో ఉన్నాను… అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సూచించారు. తన పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు తెరిచి.. అమాయకులను మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు ప్రయత్నించారని తెలిపారు.
హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాయింట్ సీపీ రంగనాథ్ వెంటనే సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి రాజస్థాన్కు ఒక బృందాన్ని పంపించి, నిందితుడిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. రాజస్థాన్కు వెళ్లి.. నిందితులను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టమైన పని అని, సైబర్నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు.
అప్రమత్తంగా ఉంటేనే సైబర్నేరాలను అడ్డుకోగలమని, గతేడాది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ సమ్మిట్లో ‘ఈజీ మనీ – ఫ్రీ మనీ ఎక్కడ లేదు.. అంటూ ప్రముఖ తెలుగు సినీ డైరెక్టర్ రాజమౌళి చెప్పిన వీడియో సందేశాన్ని చూడాలంటూ ఆయన సూచించారు. అత్యాశకు పోవద్దని, గుర్తు తెలియని లింక్లు ఓపెన్ చేయకుండా, సైబర్నేరగాళ్లు చేసే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు