బేగంపేట్/ బన్సీలాల్పేట్, అక్టోబర్ 29 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ నియోజకవర్గం అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద బేగంపేట్ డివిజన్కు చెంది న సుమారు 50 మంది మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి తలసాని వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సనత్నగర్ అల్లావుద్ధీన్ కోటికి చెందిన రిజ్వానా, మాలన్బేగం, ఇబ్రహీం, నహీం తదితరుల నాయకత్వంలో 35 మంది, డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాలుగా అల్లా ఉద్దీన్ కోటి వాసులకు ఇండ్ల పట్టాలు పంపిణీ జరగలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా రేషన్ సామాగ్రి కోసం దూర ప్రాంతానికి వెళ్లి తెచ్చుకునే వారని అన్నారు. తాను వచ్చిన వెంటనే మీ మీ బస్తీలలో రేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతే కాకుండా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
బేగంపేట్లో ముంపు సమస్యకు పరిష్కారం..
వడ్డెర బస్తీ, సింధికాలనీలకు చెందిన 15 మంది బీఆర్ఎస్ నాయకుడు నానీ ఆధ్వర్యంలో దీపక్లాల్, రఫీ, కరణ్, నవీన్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… బేగంపేట్ నాలాను 45 కోట్ల రూపాలయ వ్యయంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని అన్నారు. దీంతో బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీ తదితర ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని వివరించారు. నాలా సమీపంలోని కాలనీల్లో కూడా సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు.
కాలనీవాసులకు అండగా ఉంటా..
నియోజకవర్గంలోని అపార్ట్మెంట్లు, కాలనీలలో నివసించేవారి సమస్యలను పరిష్కరిస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్పేట్ డివిజన్లోని బోయిగూడ జయలక్ష్మి టవర్స్లో పరిసరాలలోని అపార్ట్మెంట్, కాలనీ వాసులతో ‘ఫేస్ టు ఫేస్ విత్ తలసాని’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు చెప్పిన సమస్యలు విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముషిరాబాద్ క్రాస్రోడ్ వరకు త్వరలో రోడ్డు విస్తరణ చేపడతామని అన్నారు. సరస్వతి ఆలయం మార్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి జేజే శోభ, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జి జీ పవన్కుమార్గౌడ్, ఏసూరి మహేశ్వరరావు, కే లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్రాజు, కార్యదర్శి ఎం. మహేందర్, శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్, సురేశ్, వెంకట్, గజ్జెలశ్రీను, వినోద్, వివిధ అపార్ట్మెంట్లు, కాలనీల అధ్యక్షులు గిరిధర్, దేవేందర్, పద్మజ, గాయత్రి, రామలింగేశ్వర రావు, అశోక్ కుమార్, గోపీకృష్ణ, అనిల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.