బాలానగర్, మార్చి 3 : తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ భాగ్యశ్రీగార్డెన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కె. నవీన్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు, చెవాకులు తప్పా అర్థవంతమైన మాటలు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
బీజేపీ ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 2014లో రూ.450లు వంట గ్యాస్ ప్రస్తుతం రూ.1155కు పెంచి సామాన్యుడిపై భారం మోపిందెవరని ఆయన ప్రశ్నించారు. గ్యాస్ ధరలు పెంచడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు సైతం అమాంతం పెంచుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు భారంగా తయారైందన్నారు. బీజేపీ తెలంగాణపై ప్రే ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా తీసుకురావాలిని సూచించారు.
నవీన్కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందని తెలిపారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, సయ్యద్ ఎజాజ్, కర్రె జంగయ్య, కర్రె లావణ్య, బల్వంత్రెడ్డి, మందడి సుధాకర్రెడ్డి, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, హరినాథ్, పిట్ల రాజు, నర్సింగ్రావు, బుర్రి యాదగిరి, రాజేశ్వరీ, లలిత పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 3 : కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనలో పేదలకు అచ్చేదిన్ రాలేదని.. పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్ ధరలతో పేదలు సచ్చే పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు అన్నారు. శుక్రవారం పెరిగిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ కూకట్పల్లి అంబేద్కర్ వై జంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి.. గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు జరిగిన వెంటనే గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు మహిళా దినోత్సవ కానుకగా కేంద్రం వంటగ్యాస్ ధరలను పెంచిందా అని ప్రశ్నించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ వేలకోట్ల అప్పులు చేసిన ఘనత మోదీదన్నారు. ఎనిమిదిన్నరేండ్ల పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర మూడురెట్లు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, యువకులు ఉన్నారు.
మియాపూర్, మార్చి 3: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచటాన్ని నిరిసిస్తూ బీఆర్ఎస్ హైదర్నగర్ డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై కేంద్ర దిష్టిబొమ్మను దహనం చేయటంతో పాటు నిజాంపేట చౌరస్తాలో కట్టెల పొయ్యిపై చాయ్ చేసి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ గౌరవాధ్యక్షులు దామోదర్రెడ్డి సహా పార్టీ నేతలు నేతలు, మహిళా నేతలు పాల్గొన్నారు.