దుండిగల్, జూలై 27 : ఇటీవల కాలంలో కట్టుకున్న భర్తలను హత్య చేయించడం ట్రెండింగ్గా మారిందనకుందో ఏమో.. ఓ మహిళ. తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో తెలీయదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను చంపించాలనుకుంది. అయితే నూకలు గట్టిగా ఉండటంతో బాధిత భర్త బతికి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా, పెద్దగూడెం తండాకు చెందిన నానావత్ రాందాస్ అనే వ్యక్తితో సమీపంలోని మర్రికుంటకు చెందిన జ్యోతి అనే మహిళకు 2009లో వివాహమైంది. వివాహనంతరం దంపతులు బతుకుదెరువు కోసం నగరంలోని బాలానగర్ ప్రాంతానికి వచ్చి కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో మూడేండ్ల క్రితం దంపతుల మధ్య విబేధాలు తలెత్తడంతో జ్యోతి తన భర్తపై వనపర్తి పీఎస్లో గృహహింస కేసు పెట్టింది. అప్పటినుండి రాందాస్ తన సొంత తండాలో ఉంటుండగా జ్యోతి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఒంటరిగా ఉంటూ ప్రగతినగర్ లోని జగన్ స్టూడియో సమీపంలో జొన్నరొట్టెలను విక్రయిస్తూ జీవిస్తుంది. తమ కూతుర్లు ఇద్దరిని తన తల్లిగారి ఇల్లు మర్రిగూడ వద్ద ఉంచింది.
ఈ క్రమంలో నెలరోజుల క్రితం జ్యోతి పెద్దమనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో తాను భర్తతో కలిసి ఉంటానని ఒప్పుకుంది. అప్పటినుండి రాందాస్ తన భార్య జ్యోతితో కలిసి రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కూలీపనులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పనికి వెళ్లి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాందాస్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి మీ భార్య జ్యోతి జగన్ స్టూడియో వద్ద రొట్టెలు విక్రయించే చోటుకు రమ్మంటుందని చెప్పగా ఆయన అక్కడకు వెళ్లాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ఓ యువకుడు బైక్పై అక్కడకు వచ్చి రాందాస్ను మందు తాగుదాం రమ్మంటూ పిలిచాడు. తాను అప్పటికే తాగి ఉన్నానని, నేనెక్కడకి రానని సమాధానం ఇవ్వగా జ్యోతి కలుగజేసుకుని తెలిసిన వారే కదా..! వెళ్లి రా పో… అంటూ బలవంతపెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో రాందాస్ ఆతని వెంటవెళ్లగా ఇద్దరు కలిసి సాయినగర్ కమాన్ వద్ద ఉన్న వైన్ షాపులో రెండు బీర్లు కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుండి ఇద్దరు కలిసి బౌరంపేట్ ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ వద్దకు వెళ్లారు. అక్కడ రాందాస్ ఒక్కడిచే రెండు బీర్లు తాగించారు. ఈ లోగా మరో ఇద్దరు వ్యక్తులు ఆక్కడకు చేరుకున్నారు. తాగిన మైకంలో ఉన్న రాందాస్ పై దాడిచేసి బీర్ సీసాలతో తలపై బలంగా మోదారు. దీంతో బాధితుడు సృహ తప్పడంతో సదరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు.
అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో బాధితుడు రాందాస్ సమీపంలో నివాసం ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం వివరించాడు. ఆదివారం ఉదయం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు నివాసముంటున్న నిజాంపేట రాజీవ్ గృహ కల్ప సముదాయం బాచుపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుండగా దాడి జరిగింది మాత్రం దుండిగల్ పిఎస్ పరిధిలోకి వస్తుందంటూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు కేసును దుండిగల్ పిఎస్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా తనను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే జ్యోతి ఇతరులతో కలిసి పన్నాగం పన్నిందని రాందాస్ ఆరోపించారు. తనపై గృహహింస కేసు నమోదు చేయించినప్పటి నుంచి తనను పట్టించుకోని తన భార్య నెల రోజుల క్రితమే ఇక్కడికి రప్పించుకుందని పేర్కొన్నారు. అడ్డు తొలగించుకోవాలన్న పథకంలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. తాను చనిపోయానని భావించిన అనంతరమే తనపై దాడి చేసిన వారు విడిచి వెళ్లారని బావురుమన్నాడు.