మియాపూర్, జనవరి 8 : ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియపై ఇక్కడి జోనల్ అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసే చర్యలను సైతం ప్రారంభించారు. ప్రధానంగా వీటి ఆన్లైన్ నమోదుకు స్వల్ప సమయమే ఉండటం..ఆపరేటర్ల కొరత వేధిస్తుండటంతో సకాలంలో పూర్తవుతాయా? అన్న ఆందోళన కింది స్థాయి అధికారులలో నెలకొన్నది.
వాస్తవానికి జోన్ పరిధిలోని నాలు సర్కిళ్లలో కలిపి మొత్తం 200 వరకు ఆపరేటర్లున్నట్లు అధికారులు అంచనా వేసినప్పటికీ తొలి రోజు సగం మంది వరకే విధులకు హాజరవటం.. దరఖాస్తులు లక్షల్లో ఉండటంతో గడువులోగా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న సంశయం అధికారులలో నెలకొన్నది. డిసెంబరు 31 నుంచి జనవరి 6వ తేదీ వరకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా నాలుగు సర్కిళ్లలో కలిపి ఆరు గ్యారంటీల కోసం 1.64 లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో ఎక్కువ మొత్తం పెన్షన్వే ఉన్నాయి. వీటిని సంక్రాంతి పండుగలోగా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
శేరిలింగంపల్లికి కొత్తగా వచ్చిన జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారిణి స్నేహ శబరీష్ వీటిపై సీరియస్గా దృష్టి సారించారు. జోన్ వ్యాప్తంగా ఆపరేటర్ల సంఖ్యను తెప్పించారు. 200 వరకు వారి సంఖ్య ఉండగా.. రోజుకు 8 వేల చొప్పున సంక్రాంతి లోగానే ఆన్లైన్ పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో డీసీలను ఆదేశించారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవటంతో.. దరఖాస్తుల ఆన్లైన్ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
చందానగర్ సర్కిల్లో లైట్ హౌజ్ కార్పొరేషన్ ఫెడరేషన్లో తగు కంప్యూటర్లు, ఆపరేటర్లు అందుబాటులో ఉండటంతో కాస్త ప్రక్రియ వేగంగా సాగుతున్నది. మిగిలిసన సర్కిళ్లలోనూ ఆపరేటర్లను సేకరించే పనిలో అధికారులున్నారు. ప్రయివేటు వారికి ఈ ప్రక్రియను అప్పగించిన నేపథ్యంలో.. ఫోన్లు చేసి మరీ ఆపరేటర్లను ఆన్లైన్ నమోదుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. అయితే అనుకున్న గడువులోగా దరఖాస్తుల ఆన్లైన్ ముగిస్తామన్న భరోసాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల ఆన్లైన్ వేగవంతం చేయాలి
మియాపూర్, జనవరి 8 : ప్రజాపాలనలో జోన్ వ్యాప్తంగా అందిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. తగినంత మంది ఆపరేటర్లు, కంప్యూటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుని సకాలంలో పూర్తి చేయాలన్నారు. దరఖాస్తుల ఆన్లైన్ పురోగతి శేరిలింగంపల్లి డీసీ రజనీకాంత్రెడ్డితో సోమవారం తన కార్యాలయంలో జడ్సీ సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. ఆన్లైన్ నమోదు ఎంతవరకు వచ్చిందని, ఎన్ని దరఖాస్తులు పూర్తి చేసారని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఆపరేటర్లను ప్రయివేటు సంస్థల నుంచి సేకరించి ప్రక్రియను చేపట్టాలన్నారు.
జోన్లో 1.64 లక్షల మేర దరఖాస్తులు అందినట్లు రెండు రోజులుగా 15 వేలకు పైగా ఆన్లైన్ పూర్తయినట్లు జడ్సీ స్నేహ పేర్కొన్నారు. డీసీలు ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ పురోగతిని తెలుసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. జోన్ వ్యాప్తంగా నాలుగు సర్కిళ్లలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లందరూ విధిగా ఆన్లైన్ నమోదులో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జడ్సీ సూచించారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిణి స్నేహ శబరీష్ను జోన్లోని ప్రణాళికా విభాగం సీపీ మల్లికార్జున్, ఇంజినీరింగ్ ఎస్ఈ శంకర్, బయో డైవర్సిటీ డీడీ అనీల్, వెటర్నరీ డీడీ విల్సన్ల నేతృత్వంలోని ఆయా విభాగాల అధికారులు ఆమె ఛాంబర్లో సిబ్బంది మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.