సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్లతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈనెల 22వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయని, అదేరోజు నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం అమరవీరుల జ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని అన్నారు.
అంతకుముందు నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మోటారు సైకిల్స్పై ర్యాలీగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సాయంత్రం 4 గంటల వరకు చేరుకోవాలన్నారు. అక్కడి నుంచి కళాకారులు డప్పు చప్పుళ్లతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో ర్యాలీగా అమరవీరుల జ్యోతి వద్దకు చేరుకుంటారని అన్నారు. సీఎం కేసీఆర్ అమరవీరుల జ్యోతిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని చెప్పారు. సభ ముగిసిన అనంతరం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై 750 డ్రోన్లతో అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహిస్తామన్నారు. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్లపై తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలుగా కళా ప్రదర్శనలు ఉంటాయని, అంబేదర్ విగ్రహం వద్ద కళాకారులు, డీజేల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ అశోక్రెడ్డి, టూరిజం కార్యదర్శి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.