బంజారాహిల్స్, ఏప్రిల్ 19: పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 14లో నివాసముంటున్న సుందర్రాజ్ కుటుంబానికి కర్నూల్కు చెందిన పండిత్ రాజు అలియాస్ జగ్గుల రాజు పరిచయమయ్యాడు. సుందర్రాజ్ తల్లికి మాయమాటలు చెప్పి పూజలు, శాంతి, దోషనివారణ పేరుతో రెండేళ్లుగా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.
ఇటీవల ఈ విషయాన్ని తెలుసుకున్న సుందర్రాజ్ గట్టిగా నిలదీసి, డబ్బులు వెనక్కి ఇవ్వాలని పండిత్ రాజును కోరగా.. మీ కుటుంబంపై క్షుద్రపూజలు చేస్తానని, తల్లీ కొడుకులను నాశనం చేస్తానని బెదిరించాడు. అన్నట్టుగానే ఏడాది కాలంగా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి జారుకున్నామని, తన తల్లి ఆరోగ్యం కూడా బాగులేదని, ఇందుకు కారణమైన పండిత్ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు సుందర్రాజ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.