శేరి లింగంపల్లి, జూలై 30: నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు, గౌలిదొడ్డి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈద్గోని కుంటపై ఓ బడా నిర్మాణ సంస్థ కన్ను పడింది. దీంతో గౌలిదొడ్డి గ్రామానికి చెందిన కొందరు స్థానిక ఆక్రమణదారులు పథకం ప్రకారం చెరువు కబ్జాకు తెర లేపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తమ పట్టా భూమి ఉన్నదని కోర్టుకు వెళ్లిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యవసాయ సాగు పేరుతో కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున బండరాళ్లు చెరువులో డంపింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ కుంటను అభివృద్ధి చేసి కట్టపై వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ సుందరీకరణ పనులు కొనసాగుతున్న తరుణంలోనే కబ్జాదారులు బండలు, మట్టి కుప్పలతో మొత్తం పూడ్చివేశారు.
ఈద్గోని కుంట ఆక్రమణలపై ఈ నెల 5న ఇరిగేషన్ ఏఈ జ్యోతిర్మయి ఫొటోలు, పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువు ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారని, చెరువులో బండరాళ్లతో డంపింగ్కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కబ్జా దారులకు నోటీసులు అందజేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ కమిషనర్తో కలిసి పరిశీలించిన జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖల అధికారులు బృందం కబ్జాదారుల ఆక్రమణలను స్వయంగా పరిశీలించి భారీ జరిమానా విధించారు. ఈద్గోని కుంటలో డంపింగ్ చేపట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రకాశ్లకు చెరువు ధ్వంసం కింద రూ.1.10 కోట్లు, చెరువులో చేసిన డంపింగ్ను తొలగింపు కోసం రూ.74 లక్షల చొప్పున మొత్తం రూ.1.84 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీచేశారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ జ్యోతిర్మయిని వివరణ కోరగా, చెరువులో అక్రమంగా మట్టి, బండరాళ్ల డంపింగ్ చేపట్టారని అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడ్డారని ఈ విషయమై స్థానిక స్టేషన్ ఫిర్యాదు చేశామని తెలిపారు. జాయింట్ సర్వే చేసి జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిమానా విధించినట్లు చెప్పారు.