ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: ప్రమాదవశాత్తు సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీస్టేడియంలో మంగళవారం రాత్రి స్పోర్ట్స్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు టోలీచౌకిలోని సక్సెస్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మహ్మద్ ఆథిల్ (5) తల్లి షఫియా సుల్తానా, సోదరుడితో కలిసి వచ్చాడు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అప్పటి వరకు తల్లితో ఉన్న ఆథిల్ తప్పిపోయాడు. వెతుకుతుండగా, ఓ వ్యక్తి వచ్చి బాలుడు సంపులో పడ్డాడని చెప్పడంతో హుటాహుటిన అక్కడి వెళ్లి బయటకు తీసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.