Ghatkesar | హైదరాబాద్ : ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమజంట ఆత్మహత్యకు కారణమైన పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ పోకిరీని చింటూ యాదవ్ అలియాస్ చింటూగా పోలీసులు గుర్తించారు. చింటూ స్వస్థలం మక్తా. చింటూను విచారించేందుకు పోలీసులు పీఎస్కు తరలించారు. ప్రేమజంట ఆత్మహత్య కేసులో ఇంకా ఇంకెవరి ప్రమేయమైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రేమికులు వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని పోలీసులు భావించారు. కానీ ప్రేమికుడి నివాసంలో లభ్యమైన లేఖతో.. వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టి చింటూను అరెస్టు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్కు చెందిన పర్వతం శ్రీరామ్(25) పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ రిపేరింగ్ షాపు నడుపుతున్నాడు. అతనికి అక్కడే ఉంటున్న ఓ బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం బాలిక బంధువు, మక్త గ్రామానికి చెందిన చింటూకు తెలిసింది. అతను వారిని డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించాడు. చేసేది లేక శ్రీరామ్ తన దగ్గర ఉన్న రూ.1.35 లక్షలు, బాలిక గోల్డ్రింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వదలకపోవడంతో ప్రేమికులిద్దరూ చనిపోదామనుకున్నారు. సోమవారం శ్రీరామ్ తన స్నేహితుడు నవీన్ కారును అడిగి తీసుకొచ్చాడు. అందులో ప్రేమికులిద్దరూ కలిసి సాయంత్రం ఘనపూర్ ఓఆర్ఆర్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్ను కారులోపల పోసి నిప్పంటించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్లో పేలిన ట్రాన్స్ఫార్మర్.. ఎగిసిపడ్డ అగ్నికీలలు
Hyderabad | నగరంలో ఆ నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు.. అత్యల్పం ఎక్కడంటే?