Ganesh Visarjan | ఆబాల గోపాలాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో పరవశింపజేసే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నగరంలో అట్టహాసంగా మొదలయ్యాయి. వీధివీధినా లంబోదరుడు కొలువుదీరాడు. మహానగరంలో ఈ ఏడాది దాదాపుగా 90 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విగ్రహాల సంఖ్య 25 శాతం అధికం. పుణె, ముంబై నగరాలను మించి హైదరాబాద్లో గణేశ్ విగ్రహాలు ఏర్పాటు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పొరపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ 74 కొలనులను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో ప్రస్తుతం ఉన్న 28 బేబీ పాండ్స్తో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్లను ఏర్పాటు చేశారు. ఏ గణేశ్ను ఎక్కడ నిమజ్జనం చేయాలో, నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా భారీ బందోబస్తు నడుమ కావాల్సినన్ని క్రేన్లను ఏర్పాటు నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నెక్లెస్రోడ్లోని పీఫుల్ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్లెస్రోడ్డు ట్యాంక్బండ్ పై క్రేన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 28న గణేశ్ నిమజ్జనం ఉంటుందన్నారు.
మంగళవారం గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై నెక్లెస్రోడ్లోని పీఫుల్ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్మాన్తో కలిసి మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది కంటే 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించారని, దానికి తగ్గట్టుగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనానికి ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాట్లు చేస్తామని, ఒత్తిడి లేకుండా చాలా చోట్ల బేబీ పాండ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు ముందుగానే ఏ రూట్లో వచ్చి ఏ ప్రదేశంలో నిమజ్జనం చేయాలన్న విషయం తెలియజేస్తామని చెప్పారు.
బారి కేడింగ్, లైటింగ్, జనరేటర్లు అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలు నిర్వహించబడతాయని, వారికి కావాల్సిన అదనపు బలగాలను ఇతర జిల్లాల నుంచి తెప్పించుకొని విధులు పకడ్బందీగా నిర్వహిస్తారని మంత్రి తలసాని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జనానికి 74 కొలనులు సిద్ధం
హుస్సేన్సాగర్, చెరువుల్లో పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినీ కొలనులు సిద్ధం చేసింది. భారీ విగ్రహాలు మినహా ఎక్కడికక్కడే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేలా మినీ కొలనులలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో ప్రస్తుతం ఉన్న 28 కోనేరుల (బేబీ పాండ్స్)లతో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు(బేబీ పాండ్స్)లలో నీళ్లు నింపి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఈ కొలనులో మూడు నుంచి ఐదు అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఈ కొలనుల్లో నిమజ్జనం చేయనున్నారు. పోర్టబుల్ ట్యాంకుల నిర్మాణ విషయానికొస్తే 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతులో ట్యాంకులు ఉండనున్నాయి. నేటి నుంచి ఈ మినీ కొలనులలో నిమజ్జన కోలాహలం నెలకొంది.
జోన్ : నిమజ్జన కోనేరులు
ఎల్బీనగర్ : 13
చార్మినార్ : 11
ఖైరతాబాద్ : 12
శేరిలింగంపల్లి : 14
కూకట్పల్లి : 12
సికింద్రాబాద్ : 12
మొత్తం : 74