GHMC | సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతున్నది. ప్రతియేటా వేసవి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ వినియోగంలో మే నెలలో నమోదయ్యే రికార్డులు ఈసారి మార్చి నెలలోనే నమోదవుతున్నాయి. తాజాగా గురువారం (మార్చి 28న) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79.48 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు తెలిపారు.
గతేడాది(2023) మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అత్యధిక రికార్డుగా నమోదైతే, ఈ ఏడాది మాత్రం మార్చి 28నే దాన్ని మించి నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మార్చి నెలలో అత్యధిక విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే. గతేడాది మార్చి నెల సరాసరి విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లు. దాదాపు 22.7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ సీజన్లో విద్యుత్ వినియోగం 90 మిలియన్లకు చేరే అవకాశం ఉన్నదని, డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేందుకు గాను అదనపు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
గ్రేటర్లో విద్యుత్ సరఫరా తీరుపై ప్రతి రోజు ఉదయం 8:30 గంటలకు అన్ని జోన్లు, సర్కిళ్ల పరిధిలోని సీజీఎంలు, ఎస్ఈలతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు విద్యుత్ డిమాండ్, సరఫరాలో విద్యుత్ అంతరాయాలు, సిబ్బంది హాజరు వంటి నివేదికలు పరిశీలించడం చేస్తున్నారు. దీనికి తోడు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసీ) కార్యాలయాల బలోపేతం కోసం సీబీడీ లైన్స్ వంటి ఇతర విభాగాలను ఏకీకరణ చేసి ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ పరిధిలోని 212 సెక్షన్ స్థాయి ఎఫ్ఓసీల్లో దాదాపు 800 మంది సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారు. దీనికి తోడు పీక్ అవర్స్ ముగిసే వరకు ప్రతి రోజు 9 గంటల వరకు విధుల్లోనే అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండేలా సీఎండీ ఆదేశించారు. వారానికి ఒకసారి సీజీఎం, ఎస్ఈలు విధిగా బస్తీల్లో, కాలనీల్లో పర్యటించాలని ఆదేశించారు.