మెహిదీపట్నం, అక్టోబర్ 25: దీపావళి పండుగలో అపశ్రుతి దొర్లింది. పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ఎంత చెప్పినా ప్రజల తీరు మారడం లేదు. దీపావళి పండుగ రోజున పటాకులు కాల్చుతూ 50 మంది కంటికి గాయాలు చేసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాయపడిన 50 మంది క్షతగాత్రులు చికిత్స కోసం సరోజినిదేవి కంటి దవాఖానకు వచ్చారు. వీరిలో 31 మందికి ఔట్పేషంట్గా చికిత్స చేసి పంపిన వైద్యులు, 19 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. వీరిలో మల్లేపల్లికి చెందిన అజయ్ సింగ్(ఎడమ కన్ను), యూసుఫ్గూడకు చెందిన విజయానంద్(ఎడమ కన్ను), పురాణాపూల్కు చెందిన మహావీర్(ఎడమ కన్ను), హయత్నగర్కు చెందిన రాజి (కుడి కన్ను)కు గాయాలయ్యాయి. వీరికి ఆపరేషన్లు కూడా చేశారు. మరోసారి ఆపరేషన్ చేసే వరకు కంటి చూపుపై స్పష్టత ఇవ్వలేమని సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు. రాత్రి హైదర్నగర్కు చెందిన మొహీనుద్దీన్ కూడా ఆస్పత్రిలో చేరాడు.
ఉస్మానియాకు 18 మంది క్షతగాత్రులు
సుల్తాన్బజార్, అక్టోబర్ 25: దీపావళి సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన 18 మంది క్షతగాత్రులు ఉస్మానియా దవాఖానకు చికిత్స కోసం వచ్చా రు. 18 మందిలో 17 మందికి స్వల్పగాయాలయ్యాయి. వారందరికి ఔట్ పేషంట్గా చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. బాలాపూర్కు చెందిన సుధారాణి 63 శాతం కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.