Hyderabad | సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ) : శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకుంటున్నది. పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. తాజాగా శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, బుద్వేల్, మంచిరేవుల, ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో మూసీ నది, ఈసీ నదిపై కొత్తగా 5 బ్రిడ్జీలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.129.76 కోట్లతో 5 బ్రిడ్జీలను నిర్మించేందుకు ఇటీవలే టెండర్లు సైతం పిలిచామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. నగరానికి పడమర దిక్కున ఉన్న మూసీ, ఈసీ నదిపై 3 చోట్ల, అదేవిధంగా తూర్పు వైపు ఉన్న మూసీపై 2 చోట్ల బ్రిడ్జీలను నిర్మించనున్నామని పేర్కొన్నారు. మొత్తం 5 బ్రిడ్జీల నిర్మాణ పనులను ఏకకాలంలో ప్రారంభించి 15 నెలల వ్యవధిలోనే పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జీల నిర్మాణంతో మూసీ, ఈసీ నదుల పరిరక్షణ, సుందరీకరణ వంటి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన ఐటీ పార్కును అనుసంధానం చేస్తూ హిమాయత్సాగర్ కింది భాగంలో ఉన్న మూసీ నది మీద రెండు బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు. బుద్వేల్ ఐటీ పార్కుతో రాజేంద్రనగర్ రేడియల్ రోడ్డుతో అనుసంధానం చేసేలా ఈ రెండు బ్రిడ్జీల నిర్మాణం ఉంటుంది. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఖలీజ్ఖాన్ దర్గా, కిస్మత్పూర్ ప్రాంతాలను కలుపుతూ అనుసంధానం రోడ్లను సైతం నిర్మించనున్నారు. బుద్వేల్ ఐటీ పార్కుకు సమీపంలోనే భవిష్యత్లో ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గం నిర్మాణం అవుతుండటంతో దానికి అనుసంధానం చేయనున్నారు. ఇలా కొత్తగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది.
నగరానికి పడమర దిక్కున ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ప్రభుత్వం పదుల సంఖ్యలో లింకురోడ్లు, అండర్పాస్లు, బ్రిడ్జీలను నిర్మించగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ నదిపై నార్సింగి, మంచిరేవుల మధ్య హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో నార్సింగి, మంచిరేవులతోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలైన మణికొండ, నెక్నాంపూర్, పీరంచెరువు, గంధంగూడ నుంచి సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుండగా, మెహిదీపట్నం-శంకర్పల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గనున్నది. అదేవిధంగా తూర్పు వైపున ఉన్న మూసీ నదిపై ఉప్పల్ భగాయత్, ప్రతాప సింగారం వద్ద నిర్మించే బ్రిడ్జీలతో నాగోల్ బ్రిడ్జిపై ప్రస్తుతం ఉన్న రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు నాగోల్, బండ్లగూడ, హయత్నగర్, మన్సూరాబాద్ వైపు నుంచే బోడుప్పల్, పీర్జాదిగూడ, వరంగల్ హైవే వైపు వచ్చేందుకు ఈ బ్రిడ్జీలు అనుకూలంగా మారుతాయి.