Hyderabad | సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటలలోపు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న ప్రైవేట్ బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 325 కేసులు నమోదు చేశారు. రద్దీ సమయంలో ప్రైవేట్ బస్సులు నగరం లోపలికి రావద్దనే నిబంధనలు ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటలలోపు ప్రైవేట్ బస్సులు నగరంలోకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. దీనిని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ప్రైవేట్ బస్సుల రాకపోకలకు చెక్పెట్టారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాలకు నగరం నుంచి ప్రతి నిత్యం 200కుపైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎస్ఆర్నగర్, అమీర్పేట్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో ప్రయాణికులను ఎక్కించుకునే అడ్డాలుంటాయి. ప్రధాన రోడ్లలోనే వీటి అడ్డాలు ఉండడంతో రాత్రి 10 గంటల వరకు నగరంలో సాధారణ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రాత్రి 10 గంటల తరువాతనే ఈ బస్సులకు అనుమతి ఉంటుంది. కానీ ఇటీవల రాత్రి 10 గంటలలోపే నగర రోడ్లపైకి ప్రైవేటు బస్సులు వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. దీనిపై దృష్టిసారించిన ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 325 కేసులు నమోదు చేశారు.
రద్దీ వేళల్లో ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. సాధారణ ట్రాఫిక్కు ఇబ్బందులు కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. భారీ వాహనాలకు నిర్ణయించిన సమయంలోనే నగరం లోపలికి అనుమతి ఉంటుంది, అతిక్రమించే వారిపై చర్యలుంటాయి.
– సుధీర్బాబు, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్