భాగ్యనగర ప్రభుత్వ వైద్యంలో కొత్తశకం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్), సనత్నగర్ (ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి), అల్వాల్ (బొల్లారం) లో నిర్మించే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి మంగళవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
రూ.2679 కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణానికి ఈనెల 21న ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. వెయ్యి పడకలతో జీప్లస్ 14 పద్ధతిన నిర్మించనున్నారు. అల్వాల్లో జరిగే శంకుస్థాపన ఏర్పాట్లను ఆదివారం మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి..ఛాతి ఆస్పత్రి, పండ్ల మార్కెట్లో ఎమ్మెల్యేలు మాగంటి, సుధీర్రెడ్డి, హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు శర్మన్, అమోయ్కుమార్,వైద్య ఉన్నతాధికారులు పరిశీలించారు.
సికింద్రాబాద్/అల్వాల్/వెంగళరావునగర్/ మన్సూరాబాద్, ఏప్రిల్ 24 : అల్వాల్ (బొల్లారం)లోని రాజాజీ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో మల్టీ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దవాఖాన ఏర్పాటు చేసే స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా, నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు నళినికిరణ్, శ్యామ్కుమార్, లోక్నాథ్, ప్రభాకర్, టీఎన్ శ్రీనివాస్, అందె శ్రీను, ప్రవీణ్యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర తెలంగాణకు భరోసా
నగరానికి ఉత్తరం వైపున అల్వాల్(బొల్లారం)లో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో శివారు ప్రాంతాలైన మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్పేట, కీసర ప్రాంతాలతో పాటు నాగ్పూర్ జాతీయ రహదారి మీదుగా వచ్చే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల వాసులు, రాజీవ్ రహదారి మీదుగా వచ్చే సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల వాసులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు చెందిన వారంతా గాంధీ దవాఖానకు వచ్చివెళ్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆసుపత్రి నిర్మాణంతో రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బందులను తొలగించే క్రమంలో సర్కారు అడుగులు వేస్తుంది.
ఇదీ దవాఖాన స్వరూపం
అల్వాల్ (బొల్లారం)లో ఏర్పాటు చేయనున్న టిమ్స్కు స్వయంప్రతిపత్తి హోదా ఇవ్వనున్నారు. అంటే ఇది వైద్యారోగ్య శాఖ ఆధీనంలో కాకుండా డైరెక్టర్ పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. దీని ఏర్పాటుకు రూ.897 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అల్వాల్లో రాజీవ్ రహదారికి ఆనుకుని, ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో దవాఖాన నిర్మించనున్నారు. మొత్తం 13,71,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. మొదటి బ్లాక్ను 10,53,800 చ.అడుగుల విస్తీర్ణంలో, రెండో బ్లాక్ను 3,17,420 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందులో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తారు. దీని డిజైన్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరహాలో ఉంటుంది.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్.. ఇక ఎల్బీనగర్ టిమ్స్
మన్సూరాబాద్, ఏప్రిల్ 24: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలంలో నిర్మించదలిచిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులకు ఈ నెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కలెక్టర్ అమోయ్కుమార్ తదితరులు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు రూ. 900 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించనున్నారు.
ఎర్రగడ్డ ఛాతి దవాఖాన.. సూపర్ స్పెషాలిటీ
రూ. 1000 కోట్ల నిధులు..శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
భూమి పూజ కోసం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాగంటి, కలెక్టర్ శర్మన్
వెంగళరావునగర్, ఏప్రిల్ 24: ఎర్రగడ్డలో ఛాతి దవాఖాన ఆవరణలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి ఈ నెల 26న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. భూమి పూజ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కలెక్టర్ శర్మన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ నిజాం హయాంలో సుమారు 120ఎకరాల విస్తీర్ణంలో టీబీ దవాఖాన ఉండేదని తదనంతరం ఛాతి దవాఖానగా మారిందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు ఇవ్వగా 62 ఎకరాలు మిగిలిందని, ప్రస్తుతం 270 పడకలతో దవాఖానగా నిర్వహిస్తున్నారని చెప్పారు. చాతీ దవాఖాన అభివృద్ధికి రూ. 1000 కోట్లను వెచ్చించి 1000 పడకల దవాఖానగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎండీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఆరోగ్య శాఖ స్పెషల్ ఓఎస్డీ గంగాధర్, కార్పొరేటర్ దేదీప్య విజయ్ పాల్గొన్నారు.