పల్లెప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, గ్రామీణ ముఖచిత్రం మారుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధికి, ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపరిచేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 నెలల్లోనే రూ.ఏడువేల కోట్ల నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసిందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా గ్రామాల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేదని వివరించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరిగిందని, అభివృద్ధి చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడాలనే కోరిక ఏర్పడిందని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగాయని, ఇకపై గ్రామాల్లో విద్య, వైద్యం, దళితుల అభ్యున్నతిపై దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
అద్భుతమైన స్పందన వస్తున్నది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.గ్రామాభివృద్ధి కోసం విద్యావంతులు, యువకులు, ఎన్నారైలు.. ఇలా అందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో చైతన్యం వచ్చింది. ఎవరో రావాలి.. ఏదో చేయాలన్న ఆలోచన మారింది. ‘మా గ్రామాన్ని మేమే మార్చుకుంటామ’ని చెప్తున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల్లో భయం కూడా వచ్చింది. అదే సమయంలో తాము ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఏదో ఒక పనిచేయాలన్న తపన.. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నది. ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా గ్రామాల్లో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. ఇంకా ఎక్కడైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా పూర్తిచేస్తాం. వీటి నిర్వహణ కూడా పకడ్భందీగా చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చాం. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇవ్వడం ద్వారా పారిశుద్ధ్యం, మొక్కలకు నీళ్లు పోసే సమస్య తీరింది. అధికార వికేంద్రీకరణ జరిగింది. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా తండాలను పంచాయతీలుగా మార్చారు. చిన్న పంచాయతీల ఏర్పాటుతో పర్యవేక్షణ సులభమైంది. పల్లెప్రగతి ద్వారా సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చ జరుగుతున్నది. విద్య, వైద్యం, దళిత సాధికారత వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. వీటిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధంచేశారు.
పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ. గ్రామాల్లో ప్రతిరోజూ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించే విధంగా ప్రయత్నిస్తున్నాం. దీనిద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. రోగాలు రావు. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు పూర్తిగా తగ్గాయి. చాలా గ్రామాల్లో చెత్తను బయటపారేస్తే జరిమానా విధిస్తున్నారు. పల్లెప్రగతి విజయాల్లో ప్రజాచైతన్యం కీలకమైంది. పల్లెప్రకృతి వనాలు ప్రతి గ్రామంలో ఏర్పాటయ్యాయి. వీటికోసం ట్యాంకర్లు, నీటివసతి ఏర్పాటు చేశాం. గ్రామాలకు కొత్త అందం వచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోనే కఠిన నిబంధనలు పెట్టాం. వీటిని నిర్లక్ష్యం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉన్నది. ఇప్పటికే పలుచోట్ల చర్యలు తీసుకున్నాం కూడా.
రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ వేస్తారనే భయం, రోడ్లపై చెత్తవేయవద్దన్న చైతన్యం ప్రజల్లో వచ్చింది. ప్రజలకు అవగాహన, చైతన్యం తీసుకరావడంలో విజయవంతమయ్యామనే అనుకుంటున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది ఇంత విజయవంతంగా నడుస్తున్నది. ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఉపాధిహామీ నిధులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్య, వైద్యం, దళితుల అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడతాం.
పల్లెప్రగతి తరహా కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. దీనిని కేంద్రం కూడా గుర్తించింది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా అధికారాలు, బాధ్యతలు, నిధులు కల్పించాం. పర్యవేక్షణకు అధికారులను నియమించాం. ప్రతి గ్రామానికీ పంచాయతీ కార్యదర్శిని నియమించాం. ఖాళీలు ఏర్పడిన వెంటనే భర్తీ చేసే విధంగా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చాం. అదనపు కలెక్టర్లను నియమించాం. పంచాయతీరాజ్శాఖలో ప్రతి నెలా పదోన్నతులు కల్పించాం. ప్రతి గ్రామానికి ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఏదీ లేదు. ఉపాధిహామీ పథకం ద్వారా మనకు ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువగా పనులు చేస్తున్నాం.
పల్లెప్రగతి ద్వారా ప్రతి గ్రామానికి నెలనెలా రూ.308 కోట్లకుపైగా నిధులిస్తున్నాం. ఇప్పటివరకు రూ.నాలుగు వేల కోట్లకు పైగా విడుదల చేశాం. దీనికి అదనంగా వైకుంఠధామాలకు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, రైతువేదికలు ఇలా అనేక కార్యక్రమాలకు సుమారు రూ.మూడువేల కోట్లు విడుదల చేశాం. ఇలా అన్ని పథకాలకు కలిపి దాదాపు రూ.7వేలు కోట్లు ఇచ్చాం. గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా సంక్షోభంతో రాష్ర్టానికి దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గినా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. సీఎం కేసీఆర్ ప్రతినెలా నిధులివ్వాలని నిర్ణయించారు. అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపండి కానీ, గ్రామాలకు నిధుల విడుదలలో ఆలస్యం చేయొద్దని సూచించారు. మరే రాష్ట్రం కూడా పల్లెలకు ఈ స్థాయిలో నిధులు ఇవ్వడంలేదు. ఇదో రికార్డు.