భారత్దే టీ20 సిరీస్
ఆఖరి పోరులో ఇంగ్లండ్పై విజయం
టాపార్డర్లో సీనియర్ల క్లాస్ ఇన్నింగ్స్కు.. మిడిలార్డర్లో జూనియర్ల ఊర మాస్ బాదుడు తోడవడంతో ఉత్కంఠ పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. బౌలింగ్లో కాస్త తడబడ్డా వెంటనే తేరుకున్న కోహ్లీ సేన.. ఆఖరి మ్యాచ్లో విజయంతో టీ20 సిరీస్ను చేజిక్కించుకుంది. పొట్టి
ప్రపంచకప్నకు సన్నాహకంగా సాగిన ఈ సిరీస్లో భారత్కు కొత్త హీరోలు దొరకగా.. ఒత్తిడిని జయించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఈ ఫార్మాట్లో ఎనిమిది సిరీస్ల తర్వాత తొలిసారి ఓటమి చవిచూసింది.
అహ్మదాబాద్: ఆదిపత్యం చేతులు మారుతూ సాగిన ఆఖరి పోరులో తుదికంట పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో భారీ స్కోరు చేసిన కోహ్లీసేన.. ఇంగ్లండ్ హిట్టర్లను కట్టడి చేసి 3-2తో సిరీస్ హస్తగతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి టీ20లో టీమ్ఇండియా 36 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. సూర్యకుమార్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. లక్ష్యఛేదనలో మలన్ (68), బట్లర్ (52) భయపెట్టినా.. ఇంగ్లండ్ చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో శార్దూల్ 3, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
కొట్టుడే కొట్టుడు!
రాహుల్ స్థానంలో ఓపెనర్గా దిగిన కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ ధాటిగా ఆడటంతో భారత్కు శుభారంభం దక్కింది. ఈ జోడీ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పవర్ప్లే ముగిసేసరికి టీమ్ఇండియా 60/0తో నిలిచింది. కోహ్లీ ఆచితూచి ఆడినా.. హిట్మ్యాన్ దంచికొట్టాడు. తొలి వికెట్కు 94 పరుగులు జోడించాక హిట్మ్యాన్ ఔట్కాగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన సూర్య.. రషీద్ ఓవర్లో రెండు సిక్సర్లు, జోర్డాన్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో భారీ షాట్కు యత్నించిన సూర్య ఔటైనా.. పాండ్యా కూడా బ్యాట్కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగాన్నందుకుంది. ఆరంభం నుంచి యాంకర్ రోల్కు పరిమితమైన విరాట్.. ఆఖర్లో ధనాధన్ షాట్లతో విజృంభించాడు.
మొదట భయపెట్టినా..
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రాయ్ (0)ను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ ఆనందం భారత్కు ఎక్కువసేపు నిలువలేదు. బట్లర్, మలన్ జోడీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించింది. కోహ్లీ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 127/1తో నిలిచింది. ఇక ఇంగ్లండ్ గెలు పు ఖాయమే అనుకుంటున్న తరుణంలో భువీ ఈ జోడీని విడదీయగా.. శార్దూల్ ఒకే ఓవర్లో బెయిర్స్టో (7), మలన్ (68)ను ఔట్ చేసి మ్యాచ్ను మనవైపు తిప్పాడు. మోర్గాన్ (1), స్టోక్స్ (14) ప్రభావం చూపలేకపోయారు.
ఇంగ్లండ్పై
అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియాకు అభినందనలు. టీ20ల్లో భారత్కు ఇది వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మెండైన ఆత్మవిశ్వాసం కల్గిన యువ క్రికెటర్లు వచ్చి రావడంతోనే అదరగొడుతూ జట్టు
విజయాల్లో కీలకమయ్యారు.
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (బి) స్టోక్స్ 64, కోహ్లీ (నాటౌట్) 80, సూర్యకుమార్ (సి) రాయ్ (బి) రషీద్ 32, పాండ్యా (నాటౌట్) 39, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 224/2. వికెట్ల పతనం: 1-94, 2-143, బౌలింగ్: రషీద్ 4-0-31-1, ఆర్చర్ 4-0-43-0, వుడ్ 4-0-53-0, జోర్డాన్ 4-0-57-0, సామ్ కరన్ 1-0-11-0, స్టోక్స్ 3-0-26-1.
ఇంగ్లండ్: రాయ్ (బి) భువనేశ్వర్ 0, బట్లర్ (సి) పాండ్యా (బి) భువనేశ్వర్ 52, మలన్ (బి) శార్దూల్ 68, బెయిర్స్టో (సి) సూర్యకుమార్ (బి) శార్దూల్ 7, మోర్గాన్ (సి) (సబ్) రాహుల్ (బి) పాండ్యా 1, స్టోక్స్ (సి) పంత్ (బి) నటరాజన్ 14, జోర్డాన్ (సి) సూర్యకుమార్ (బి) శార్దూల్ 11, ఆర్చర్ (రనౌట్) 1, సామ్ కరన్ (నాటౌట్) 14, రషీద్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 20, మొత్తం: 20 ఓవర్లలో 188/8. వికెట్ల పతనం: 1-0, 2-130, 3-140, 4-142, 5-142, 6-165, 7-168, 8-174, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-15-2, పాండ్యా 4-0-34-1, సుందర్ 1-0-13-0, శార్దూల్ 4-0-45-3, నటరాజన్ 4-0-39-1, చాహర్ 3-0-33-0.