వేములవాడ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం
అదుపుతప్పి కారు మల్లన్న సాగర్ కాలువలో పడి మృతి
తొగుట, మార్చి 19 : మృత్యువు ఏరూపంలో వస్తుందో చెప్పలేము. నిజామాబాద్ నుంచి వేములవాడ రాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన వ్యక్తి, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో దారితప్పి సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట శివా రులోని మల్లన్న సాగ ర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. సిద్దిపేట జిల్లా తొగుట ఎస్సై సామ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన విద్యావేత్త, విశ్వశాంతి విద్యాసంస్థల అధినేత కామెపల్లి ప్రభాకర్రావు (54) గురువారం మధ్యాహ్నం తన కారు (TS16-FB6888)లో ఒంటరిగా వేములవాడ రాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లాడు. స్వామివారిని దర్శించుకొని అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో కామారెడ్డి దారి తప్పి సిద్దిపేటకు చేరు కున్నాడు. అక్కడి నుంచి తొగుట మండలం ఎల్లారెడ్డిపేట మల్లన్న సాగర్ కాలువ వద్దకు రాత్రి 9 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. అక్కడ ఉన్న వారిని కామారెడ్డి రూట్ అడగ్గా, కాలువ అవతల నుంచి బీటీ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. కానీ, ఆయన మట్టి రోడ్డు గుండా కాలువ వెంట వెళ్లి దారితప్పి కారుతో సహా కాలువలో పడిపోయాడు. కాలువలో నీరు పారుతుండడంతో ఈత రాక అందులోనే మరణించాడు. మృతుడి భార్య రోజారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిజామాబాద్లో విశ్వశాంతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, విద్యా వికాసం కోసం కృషిచేసిన ప్రభాకర్రావు అకాల మరణం నగర వాసులను ఎంతో కలిచివేసింది.