సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నది. నాలుగు రోజులకు సంబంధించి అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డు, ఇతర సమస్యలపై ప్రజలు సమర్పించిన దరఖాస్తులు మొత్తం 13,54,817లను అధికారులు స్వీకరించారు.
ఇందులో అభయహస్తం కింద 11,31,390 దరఖాస్తులు ఉండగా, ఇతర ఆప్లికేషన్లు 2,23,427 ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 3,62,606 దరఖాస్తులను స్వీకరించినట్లు కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణలో అత్యధికంగా రేషన్కార్డు, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, రూ.500లకు సిలిండర్లకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.