పొట్టకూటి కోసం హైదరాబాద్కు వచ్చినవారు కొందరు… బస్తీల్లో ఏండ్లకేండ్లుగా భారంగా బతుకీడుస్తున్నవారు మరికొందరు. చిన్నాచితక ఉద్యోగాలు… చాలీచాలని ఆమ్దానీ.. ఉన్న సంపాదనంతా ఇంటి కిరాయికే సరిపాయె. ఇక ఆరోగ్యం, పిల్లల చదువుల సంగతి దేవుడెరుగు. ఇలాంటి వారందరికీ సీఎం కేసీఆర్ పెద్ద దిక్కులా మారారు. రూపాయి ఖర్చు లేకుండా, పారదర్శకంగా మహానగరంలో సొంతింటి కలను సాకారం చేశారు. ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కలలో కూడా ఊహించని విధంగా నిలువ నీడలేని కుటుంబాలకు సగర్వంగా బతికే అవకాశం కల్పించారు. అద్దె ఇండ్ల నుంచి ఆత్మగౌరవ భవనాల్లోకి అడుగుపెడుతున్నందుకు వారంతా పట్టరాని సంతోషంతో ఉన్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ)
చిన్న కుటుంబం. భర్త డ్రైవింగ్తోనే బతుకు బండి నడుస్తున్నది. తిండి, పిల్లల ఫీజులే సంపాదనలో సగానికిపైగా పోతుంటే ఇంటి కిరాయి గుదిబండలా మారుతున్నది. నెల గడిస్తే చాలు అనుకుంటున్న సమయంలో డబుల్ బెడ్రూం ఇల్లు వరించింది. అద్దె ఇంటి తిప్పలను సీఎం కేసీఆర్ తొలగించారని సంబరపడుతున్నది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్కు చెందిన మోముల వరలక్ష్మి.
బంజారాహిల్స్ రోడ్ నం. 12 సమీపంలో శ్రీరాంనగర్ బస్తీలో ఉండే గడ్డమీద భాగ్యమ్మ(58) భర్త 20 ఏండ్ల కిందటే చనిపోయారు. చేతికొచ్చిన కొడుకు హఠాన్మరణం ఆమెను మరింత కుంగదీసింది. మరో ఇద్దరి కొడుకుల చెంతకు చేరాలని ఉన్నా వారి ఆర్థిక పరిస్థితి ఆమెను ఒంటరిని చేసింది. 40 ఏండ్లుగా రేకుల ఇంటిలో ఆమె జీవితాన్ని నెట్టుకొస్తున్నది. రూ.35తో మొదలైన కిరాయి ప్రస్తుతం రూ. 3500 కట్టే వరకు వచ్చింది. ఈ పరిస్థితిలో భాగ్యమ్మను సీఎం కేసీఆర్ తోబుట్టువులా ఆదుకున్నారు. రాఖీ పండుగ కానుకగా పెద్దన్నలాంటి సీఎం కేసీఆర్ సొంతింటిని కట్నంగా ఇచ్చారని మురిసిపోతున్నది.
‘ఎన్నో కష్టాలు పడ్డాం.. వానకు తడిసినం.. ఎండకు ఎండినం.. రెక్కాడితే డొక్కాడని జీవితాలు మావి.. కిరాయి ఇండ్లలో ఉండి అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నాం. దేవుడిలా సీఎం కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. అన్ని సౌకర్యాలతో అద్భుతమైన ఇంటిని కేటాయించారు. కేసీఆర్ సార్ మనసున్న మారాజు ఆయనకు పేదల కష్టాలు తెలుసు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలి’. అని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు అన్నారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన ముఖమంత్రికి రుణపడి ఉంటామని చెప్పారు. ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడిన వారు..డబుల్ బెడ్రూం ఇంటి పట్టాను అందించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని ఆకాంక్షించారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 3(నమస్తేతెలంగాణ)
మాది మహబూబ్నగర్ జిల్లా . ఊర్లో భూమి లేక బతుకు దెరువు కోసం పట్నం వచ్చినం. ఫతేనగర్ డివిజన్ అమృత్నగర్ తండాలో 50 ఏండ్లుగా రేకుల ఇంటిలోనే కాలం గడిపినం. కూలీ పనిచేస్తూ.. అతి కష్టంగా పిల్లలను పెంచి పెద్ద చేశాం. బిడ్డల పెండ్లి కష్టపడి చేసినం. భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులున్నారు. వారిని పోషించలేక తిప్పలు పడుతున్న . మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని తెలిసి బహదూర్పల్లికి వెళ్లాం. అక్కడ నాకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సారు, ఎమ్మెల్యే కృష్ణారావు సారు ఇంటి పట్టా అందజేశారు. నాకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. కొంత సేపు ఇది నిజమా….? కలా అన్న అనుమానం వచ్చింది. తేరుకున్నాకా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోళ్ల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తారనే మాట విన్నాం…. కానీ ఆ ఇల్లు నాకు వస్తుందని అనుకోలే. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గండి మైసమ్మ చౌరస్తా దగ్గర డి. పోచంపల్లిలో ఇల్లు వచ్చింది. డి. పోచంపల్లిలో బ్లాక్ నంబర్1లో 9వ అంతస్తులో 2వ ఇల్లు ఇంటికి పట్టా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పేదోళ్లకు మేలు చేస్తున్నరు. కేసీఆర్ సార్ మనసున్న మారాజు. ఆయనను మించిన నేత తెలంగాణలో లేరు. కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలె. .ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదలకు మంచి జరుగుతుంది.
– పతావత్ సాలిబాయి, లబ్ధిదారు
కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. నాభర్త చిరు వ్యాపారి. వచ్చే డబ్బులతో కిరాయి కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాం. మాకు కొడుకు, కుమార్తె ఉన్నారు. వారిని చదివించే స్తోమత లేక పెద్ద చదువులు చదివించ లేక పోయాం. మా కుమారుడికి కొన్ని ఏండ్లుగా ఆరోగ్యం బాగాలేదు. ఇంటి కిరాయి కట్ట లేక అవస్థలు పడ్డాం. కిరాయి కట్టకపోవడంతో కొద్ది రోజుల కిందట యజమాని ఇంటిని ఖాళీ చేయించడంతో వేరే ఇంట్లోకి మకాం మార్చాం. ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిందని తెలిసింది. నేను నమ్మలేక పోయా. దేవుడిని మొక్కుకున్నా. బహదూర్పల్లికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లాం. నాకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సార్, ఎమ్మెల్యే కృష్ణారావు సార్ ఇంటి పట్టాను అందజేశారు. నాకు దుండిగల్ దగ్గర ఉన్న గండి మైసమ్మ చౌరస్తా దగ్గర డి. పోచంపల్లిలో ఇల్లు వచ్చింది అని చెప్పారు. డి. పోచంపల్లిలో బ్లాక్ నంబర్ 8లో 8వ అంతస్తులో 7వ ఇల్లు ఇంటికి పట్టా ఇచ్చారు. నాకు పట్టలేని ఆనందం వచ్చింది. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాం. ఇంటి కిరాయి ఇవ్వలేని విధంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో సీఎం సార్ దేవుడిలా వచ్చారు. కేసీఆర్ సార్ వంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు. ఆయనకు పేదల కష్టాలు తెలుసు అందుకే ఆయనకు ప్రజల నుంచి ఎంతో ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో సార్కే మద్దతిస్తాం.
-చలమల మణెమ్మ, డబుల్ బెడ్రూం లబ్ధిదారు
కొల్కత్తా కరక్పూర్ నుంచి 35 ఏండ్ల కిందట హైదరాబాద్కు వలస వచ్చి మూసాపేట లక్ష్మీనరసింహా స్వామి ఆలయం వద్ద నివాసముంటున్నాం. నా భర్త 20 ఏండ్ల కిందట గుండెపోటుతో చనిపోవడంతో అనేక కష్టాలు పడ్డాం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను ప్రశాంత్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో రోజు వారీ కూలీగా పనిచేస్తున్నా. నా సంపదన నెలకు రూ. 6వేలు చాలీచాలని సంపాదనతో ప్రతి నెలా ఇంటి కిరాయి చెల్లించడం భారంగా మారింది. కిరాయితో పాటు కరెంటు బిల్లు, నల్లా బిల్లు అంటూ యజమానులు డబ్బులు దండుకునేవారు. ఇల్లు నచ్చకపోయినా గత్యంతరం లేక కిరాయి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నెలకు రూ. 3500 అద్దె కట్టడం కష్టమవుతుండేది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే ఒంటరి మహిళ పించన్ రూ. 2వేలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారులు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ పుణ్యమా అని సొంత ఇల్లు వచ్చింది. నా కుటుంబానికి నీడనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు నా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది.
– కోల మీన, డబుల్ బెడ్రూం లబ్ధిదారు
నగరానికి పొట్ట కూటి కోసం వచ్చాం. 30 ఏండ్ల కిందట నగరానికి వచ్చి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి జీవనం సాగిస్తున్నాం. వచ్చిన చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేందుకే అవస్థలుపడ్డాం. కిరాయి ఇంటిలో 30 ఏండ్లుగా కాలం వెల్లదీశాం. సీఎం కేసీఆర్ దయతో డబుల్ బెడ్రూం దక్కింది. మా ఆనందానికి అవధులు లేవు’ అని డబుల్ బెడ్రూం లబ్ధిదారు రేణుక అన్నారు. మహబూబ్నగర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన జగదీశ్, రేణుక 30 ఏండ్ల కిందట బతకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. కొత్తపేట మోహన్నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2 లోని రెండో బ్లాక్ ఫ్లాట్ నంబర్ 107లో రేణుక తన భర్త జగదీశ్, కూతురు సంతోషి, అల్లుడు రవితో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్ అద్దె ఆరువేలు కాగా మెయింటెనెన్స్ రూ. 600తో పాటు ఇతర ఖర్చులు కలిపి సుమారు నెలకు రూ. 20 వేల వరకు వెచ్చిస్తున్నారు. రేణుక భర్త జగదీశ్ వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తులు చేసుకోమనగానే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం తీసిన డ్రాలో ప్రతాప్సింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో బ్లాక్లో 6లోని 8వ నంబర్ ఫ్లాట్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని మనసారా ఆకాంక్షించారు రేణుక.
– రేణుక, డబుల్బెడ్రూం లబ్ధిదారు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పారదర్శకంగా పంపిణీ చేస్తున్నదని, ఒకే రోజు 11700 మందికి ఆత్మగౌరవ ఇండ్లను కేటాయించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ వార్డు పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను పొందిన లబ్ధిదారులు ఆదివారం మేయర్ను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఇండ్లను పొందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోకూడదని, ఒక వేళ అమ్మినా.. ఎవరైనా కొన్నా చర్యలు తీసుకుంటామన్నారు.
నా భర్త పేరు ఎండీ సలీం. మాకు నలుగురు పిల్లలు. 30 ఏండ్ల కిందట మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాం. నెలకు 5,500 ఇంటికి కిరాయి కట్టుకోవడంతో పాటు ఇంట్లో పిల్లలకు, కుటుంబ అవసరాలకు నా భర్త ట్రాలీ ఆటో నడిస్తున్నాడు. నేను చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. పిల్లల పెండ్లిళ్ల చేసేందుకే మా ఆలోచనలు తప్పా.. సొంత ఇంటి నిర్మాణం కోసం ఆలోచన లేకుండే. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు కలిగింది. చిన్నపాటి అద్దె ఇంట్లో ఉంటూ బంధవులు వచ్చినా సరిపోకుండా చాలీచాలనీ జీవితాలతో కాలం వెళ్లదీస్తున్న మాలాంటి కుటుంబాలను సీఎం కేసీఆర్ గుర్తించడం చాలా సంతోషంగా ఉన్నది.
– ఖాసీంబాయ్ బేగం,డబుల్బెడ్రూం లబ్ధిదారు
మాది సొంతూరు తెనాలి. నా భర్త రవితో కలిసి పదేండ్ల కిందట నగరానికి వలస వచ్చాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సుభాష్నగర్ డివిజన్ రాజీవ్గృహకల్పలోని ఓ రేకుల ఇంట్లో నెలకు రూ.2500 కిరాయికి ఇచ్చి జీవనం కొనసాగిస్తున్నాం. పిల్లల చదువులతో పాటు రోజువారీ ఖర్చులకు సరిపోతున్నది. రేషన్కార్డు, ఓటర్కార్డు, ఆధార్కార్డులు ఉన్నాయి. మేము ఆంధ్రా వాళ్లం కదా డబుల్ బెడ్రూం వస్తుందో లేదోనని అనుకున్నాం. కానీ అందరూ దరఖాస్తు చేస్తున్నారు.. కాదా మేము కూడా చేశాం. అధికారులు మాకు ఫోన్ చేసి డబుల్ బెడ్రూం మంజూరైందని చెప్పిన తర్వాత మాకు నిజంగా చాలా సంతోషం వేసింది. సీఎం కేసీఆర్ పాలనలో ప్రాంతాలతో సంబంధం లేకుండా మాలాంటి వారిని సైతం గుర్తించడం ఊహించలేదు.
డబుల్ బెడ్రూం కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇల్లు మంజూరైందని చెప్పాక నమ్మలేకపోయాం. కలలో కూడా ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. మాది మెదక్ జిల్లా ఔరంగాబాద్. నా భర్త గంగాధర్ వెల్లర్. ఇద్దరు పిల్లలు. 18 ఏండ్ల కిందట నగరానికి వలస వచ్చాం. నేను కుట్టుమిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో ఇంటి అద్దె చెల్లించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నాం. ఇంటి కిరాయి ఆరు వేలు ఉండగా పిల్లల చదువులకు కావాల్సిన ఖర్చులే కాకుండా కుటుంబ అవసరాల కోసం ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దోళ్లు అయ్యారు. వాళ్లకు జాబ్లు వచ్చాక ఇల్లు కట్టుకొని వివాహాలు చేద్దామని అనుకున్నాం. దానికి కావాల్సిన డబ్బులు ఎలా చేద్దామని నిత్యం మనోవేదనకు గురయ్యేవాళ్లం. ఇప్పుడు ఆ చింత లేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూంతో ఇప్పుడు ఎంతో భరోసా ఇచ్చింది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గడ్డం మంజుల,డబుల్బెడ్రూం లబ్ధిదారు
ఎన్టీఆర్నగర్లో నివాసముండే ముంతాజ్ బేగం భర్త అంజత్దుద్దీన్తో పాటు నలుగురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. భర్త కారు డ్రైవర్గా పని చేస్తుండగా. నలుగురు పిల్లలు వేర్వేరు చేతి వృత్తి పనులతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. సొంత స్థలం, ఇల్లు లేని ముంతాజ్ బేగం కుటుంబంతో 30 ఏండ్లుగా కిరాయి ఇంట్లోనే ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా…తాజాగా నిర్వహించిన లాటరీలో ముంతాజ్ బేగం ఎంపికయ్యారు. దీంతో సీఎం కేసీఆర్ సార్ మేలు మరిచి పోలేమని, మా లాంటి నిరుపేదలకు పైస తీసుకోకుండా లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని ఇవ్వడం ఎంతో సంతోషానిచ్చిందని ముంతాజ్ బేగం పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ సార్ పాలనలో పేద ప్రజలకు అన్ని విధాలా భరోసా లభిస్తున్నది. పెన్షన్ రూపంలో ఆదుకుంటూ సొంత ఇంటిని సమకూర్చిన ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి. కార్పొరేటర్, ఎమ్మెల్యే సార్ల కృషి వల్ల మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. వారి ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ’అని ముంతాజ్ బేగం అన్నారు.
– ముంతాజ్ బేగం, డబుల్బెడ్రూం లబ్ధిదారు
37 ఏండ్ల అనంతరం ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరిందన్నారు గోల్నాకకు చెందిన గీత. ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని, దళారులకు లక్షల రూపాయలు ఇచ్చాను. డబ్బులు పోయాయే కాని, ఇల్లు మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వ హయంలో 2016లో డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఫోన్ చేసి అమ్మ మీకు లాటరీలో డబుల్బెడ్రూం వచ్చిందని చెప్పారు. త్వరలో మీ దగ్గరకు మా అధికారులు వస్తారని చెప్పగానే నాకు ఒక్కసారే ఇది కలానా.. నిజమా…అనే సందేహం కలిగింది. కొద్ది గంటల పాటు అయోమయంలోపడ్డా. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్లో ఉదయం టిఫిన్ పెట్టి, బస్సులో ప్రతాపసింగారానికి తీసుకెళ్లి ఇల్లు కేటాయించడంతో నా జీవితం ధన్యమైంది. 37 ఏండ్ల కిందట రూ.320 కిరాయి కట్టేవాళ్లం. అది కాస్తా ఇప్పుడు రూ.5 వేల రూపాయలు చెల్లిస్తున్నాను.నా భర్త యాదయ్య టెంట్హౌజ్లో పనిచేస్తాడు. కొన్నేండ్లుగా ఇండ్లల్లో పని చేసుకుంటున్న నాకు డబుల్బెడ్రూం రావడంతో ఆత్మగౌరవం పెరిగింది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల రూపాయలు వెచ్చించి డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద ప్రజలకు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది’ అని గీత అన్నారు. సీఎం కేసీఆర్తోనే పేద ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయన్నారు.
– గీత, డబుల్బెడ్రూం లబ్ధిదారు
నా భర్త గోవింద్నాయక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాం. నెల తిరిగే సరికి ఒకవైపు అద్దె కట్టాల్సి రావడం.. పిల్లలను ఫీజులు కట్టాల్సి వస్తుండటంతో పస్తులు ఉండాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశపెట్టగానే 2016లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాం. దేవుడి రూపంలోనే సీఎం కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూం ఇంటి పథకాన్ని తీసుకువచ్చారనుకున్నాం. కొంచెం ఆలస్యమైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మాకు డబుల్ బెడ్రూం ఇంటిని ఇచ్చారు. త్వరలోనే సొంతింట్లోకి వెళ్తాం.
-జాదవ్ సుందరీబాయి, డబుల్బెడ్రూం లబ్ధిదారు
నా జీవితం కిరాయి ఇంట్లోనే గడిచిపోయింది. అటు పుట్టింటోళ్లకు, ఇటు అత్తింటోళ్లకు సొంతిల్లు అనేది లేదు. పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు మారినమో లెక్కనేలేదు. జీవితమంతా అద్దె కొంపల్లోనే గడిచిపోయింది. పెండ్లి అయ్యి 35 ఏండ్ల పైమాటే. 18 ఏండ్ల కిందట నా భర్త చనిపోయిండు. నాకు 7 మంది సంతానం.. 5 గురు ఆడపిల్లలు,. ఇద్దరు కొడుకులు. ఇవే అద్దె ఇండ్లల్లో ఉంటూ నలుగురు కూతుళ్ల పెండ్లిండ్లు చేశా. ఇంట్లో అందరూ పని చేస్తే తప్ప గడిచే పరిస్థితులు లేవు. ఇంకా ఓ బిడ్డ, ఇద్దరు కొడుకుల పెండ్లిళ్లు చేయాల్సి ఉంది. జీవితం గడిచిపోతోంది. పిల్లల కోసం ఏమీ చేయలేకపోయిన.. అంటూ బాధపడని రోజు లేదు. ఇంట్లోకి ఎవరైనా వస్తే కూర్చోబెట్టేందుకు కుర్చీలు కూడా సరిగ్గా లేవు. ఇట్లాంటి పరిస్థితిలో జీవితాలను నెట్టుకొస్తున్నాం. ఆశలన్నీ వదిలేసుకుని జీవనం కొనసాగిస్తున్న దశలో ఇటీవల వచ్చిన ఓ ఫోన్ కాల్ మా జీవితాల్లో ఆనందాన్ని నింపింది. అధికారులు ఫోన్ చేసి, మీకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైందని చెప్పారు. అయినా మేము నమ్మలేదు. ఎవరితో పైరవీ చేయలేదు, ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా మాకు ఇల్లు ఎట్ల వస్తదని ఊరుకున్నం. ఇంతలో మరోసారి ఫోన్ కాల్ రావడమే కాకుండా, మా బసీ ్తపెద్దలు కూడా.. నీకు డబుల్ బెడ్రూం మంజూరైందని చెప్పడంతో మాకు నమ్మకం ఏర్పడింది. నలుగురు ఆడపిల్లల వివాహాలు అద్దె ఇంట్లో చేసిన.. మిగిలిన బిడ్డ, ఇద్దరు కొడుకుల పెండ్లిళ్లు గౌరవప్రదంగా నాకు మంజూరైన డబుల్ బెడ్రూం ఇంట్లో చేస్తా. గుండ్లపోచంపల్లిలో ప్రభుత్వం మాకోసం కట్టించి ఇచ్చిన ఇంట్లోకి ఎప్పుడు పోతామా అని ఆశగా ఎదురు చూస్తున్నాం..
– పాషా బీ, అల్లాద్దీన్ కోఠి డబుల్బెడ్రూం లబ్ధిదారు