సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ) : చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ మరో ముందడగు వేసింది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు లభించడం… దాదాపు రూ.3.75కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ ద్వారా సంబంధిత ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి రెండేళ్ల పాటు నిర్వహణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆరు జోన్ల పరిధిలో 1170 సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై రేపు (బుధవారం) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. కాగా సంబంధిత చెరువుల్లో ఎలాంటి డంపింగ్ వేయకుండా, వేసిన వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం, కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఈ విధానం సులువుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జీహెచ్ఎంసీకి సంబంధించి 185 చెరువులను పరిరక్షించి, పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ, చెరువు భౌగోళిక స్వరూపం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ప్రాంతం, రెవెన్యూ మండలం వివరాలపై సమగ్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు.
ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలతో కలిసి ఫైనల్ నోటిఫైడ్ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ వెబ్సైట్లో చెరువు వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఎఫ్టీఎల్ హద్దు మ్యాప్ల అంతిమ నోటిఫికేషన్ను జారీ చేయడానికి హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా నియమించుకుని జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. చెరువుల సంరక్షణ కమిటీ వెబ్సైట్లో 157 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేశారు. మరో 28 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల చెరువుల పరిరక్షణలో ఎఫ్టీఎల్ పరిధిలో 8718 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా, బఫర్ జోన్లో 5353 నిర్మాణాలు గుర్తించారు. 51 చెరువులలో ఆక్రమణలు లేవని స్పష్టం చేశారు. 30 చెరువుల్లో 85 శాతం ఆక్రమణలు ఉండగా, 104 చెరువుల్లో 15శాతం ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. ఎఫ్టీఎల్/బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణల్ని తొలగించడం జరుగుతుందని, అక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
‘ఈద్గోనికుంట’ పరిరక్షణకు చర్యలు
శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లి ఈద్గోనికుంట చెరువులో మట్టి డంపింగ్ ఆక్రమణలపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. సోమవారం ఈద్గోనికుంట ప్రాంతంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖల అధ్వర్యంలో ఈద్గోనికుంట చెరువు ప్రాంతంలో లేక్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో ఇద్దరు చొప్పున సిబ్బంది ఆ ప్రాంతంలో కాపలాగా ఉన్నారు. చెరువులో మట్టి డంపింగ్కు పాల్పడకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో కలిసి చెరువును పరిశీలించారు. చెరువుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ సర్వే నంబర్ 37లో ఎకరా స్థలంలో వెలసిన అక్రమ ప్రహరీని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో సిబ్బంది కూల్చివేశారు. ఇది ఇలా ఉంటే.. తమ పట్టా స్థలంలో ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న అభివృద్ధి పనులపై గతంలో తాము కోర్టును ఆశ్రయించామని, తమ భూమికి నాలా కన్వెన్షన్ సైతం చేయించామని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మీడియాతో వెల్లడించారు. మట్టి డంపింగ్తో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.