జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం
అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆసిఫాబాద్, జూన్ 15: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవుల అభివృద్ధి కోసం పటిష్ట ప్రణాళికను రూపొందించామని జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఏడో విడుత హరితహారం కార్యక్రమంపై మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 2,44,540 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లాగా ఇప్పటికే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు పేరుందన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే ప్రతి బీట్ పరిధిలో 2014 సంవత్సరం తర్వాత అక్రమంగా బీసీ వారు పోడు సాగు చేసిన భూమిని గుర్తించి తిరిగి తీసుకోవడానికి నిర్ణయించినట్లు వివరించారు. గిరిజనులకు ఇప్పటికే హక్కు పత్రాలు ఉండి లేదా రెవెన్యూ భూమి ఉన్నప్పటికీ దానిని సాగు చేయకుండా అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న పోడు భూములను తిరిగి తీసుకోనున్నట్లు తెలిపారు.
తడోబా నుంచి జిల్లాకు పులులు వచ్చే మార్గంలో అక్రమంగా 2 వేల హెక్టార్ల భూమి సాగు చేసినట్లు వివరించారు. దీని వల్ల పులి రాకపోకలకు ఇబ్బంది కావడమే కాకుండా ప్రజలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఆ భూమిలో మొక్కలు నాటి అడవిని పెంచడం వల్ల పులి తిరగడానికి అనువుగా ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా కుంటల తవ్వకాలు, బౌండరీ పిల్లర్లు ఏర్పాటు చేయడం, కుంటల కట్టలపై మూడు వరుసల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఇప్పటకే జంతువులు నీరు తాగేందుకు రాళ్లకట్టలు, వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఫైర్లైన్ వేసినట్లు తెలిపారు. నర్సరీల పెంపకం, పర్యాటకులు ఆకర్షించే విధంగా జిల్లాలో రెండు అర్బన్ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి ఉన్నతాధికారులు జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ఇచ్చారని, తాము 18.50 లక్షల మొక్కలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్డీఏ రవికృష్ణ, రేంజ్ అధికారి అప్పలకొండ, డిప్యూటీ రేంజ్ అధికారి యోగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.