హైదరాబాద్ : డార్క్ నెట్ వెబ్సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 11 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
నిందితుల్లో సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులే అధికంగా ఉన్నారు. గతంలో కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులను వదిలేశామన్నారు. విద్యార్థులు మళ్లీ డ్రగ్స్ వాడుతున్నారు. అందుకే విద్యార్థులను అరెస్టు చేశాం. డ్రగ్స్కు అలవాటైన వారే క్రమంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. పట్టుబడిన ముఠాలో ఒక నైజీరియన్ కూడా ఉన్నాడు. నైజీరియనే డ్రగ్స్, సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీసా గడువు తీరినా దేశంలో ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర సంస్థల దృష్టికి తీసుకెళ్లాం. మంచి ఉద్యోగాలు చేస్తున్న వారే డ్రగ్స్ వినియోగిస్తున్నారు.
మూడు డ్రగ్స్ కేసుల్లో 11 మందిని అరెస్టు చేశామని తెలిపారు. హెచ్సీయూలోనే ఏడుగురిని అరెస్టు చేశాం, మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. రూ. 4.50 లక్షల విలువ చేసే డ్రగ్స్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. అందుకే స్టూడెంట్స్ను అరెస్టు చేస్తున్నామని సీపీ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ సీవీ ఆనంద్ తేల్చిచెప్పారు.