సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ)/ చాంద్రాయణగుట్ట : ముస్లింలకు వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇచ్చి మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. చార్మినార్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి హోంమంత్రి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మైనార్టీ బంధు పథకంతో వేలాది మంది మైనార్టీలకు లబ్ధి చేకూరుతుందని, లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని అనూహ్యరీతిలో అభివృద్ధి చేస్తున్నారని, మైనార్టీలు, పేదల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కాలర్షిప్లు, షాదీ ముబారక్ తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.
దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీహుల్లాఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్, మాజీ అధ్యక్షుడు రహీముల్లాఖాన్ నియాజీ, అక్బర్ హుస్సేన్, సల్లాహుద్దీన్, బద్రుద్దీన్, షబ్బీర్ అహ్మద్, ఆరీఫుద్దీన్, అబ్దుల్ బాసిత్, నవాబ్ మీర్ అర్షద్, అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని వక్ఫ్బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ అన్నారు. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం జీఓను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయనగర్ కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అభిషేక్రాజ్, సయ్యద్ లతీఫ్ అహ్మద్, జమాల్ ఖాన్, శివనారాయణ్, మహ్మద్ అంజద్ఖాన్, అన్వర్ పాల్గొన్నారు.
– అబిడ్స్, జూలై 25