సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : పేదల గూడుకు సర్కారు సొబగులు అద్దనున్నది. నగర ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సు చాటుకున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ. 100 కోట్లు మంజూరు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించారు. పేదలు నివసించే ఈ కాలనీల్లోని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పేదల పక్షపాతి అయిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 9100 కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ చొరవతో నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్లకు అవసరమైన నిధులను హెచ్ఎండీఏ విడుదల చేయనున్నది. నిధులకు అనుగుణంగా మరమ్మతులు చేయాలని ఆదేశించినట్లుగా బల్దియా వర్గాలు వెల్లడించాయి. నగరంలో జంగంమెట్, బండ్లగూడ వంటి ప్రాంతాలలో ఈ కాలనీలు ఉండగా… మంత్రి కేటీఆర్ ఆదేశాలతో స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని అధికారులు తెలిపారు.