సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 35 రోజుల్లో 25శాతం అదనంగా ఇస్తానంటూ నమ్మించిన ఓ వ్యక్తి పలువురి వద్ద నుంచి రూ.1.3 కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్మారేడ్పల్లికి చెందిన ప్రక్షిత్ యాదవ్ స్టాక్ ట్రేడింగ్ చేస్తుంటాడు.
ఇతడికి శ్రావణ్ ద్వారా సికింద్రాబాద్ ప్రాంతానికి చెంది మర్రి అనీశ్ పరిచయం అయ్యాడు. ప్రక్షిత్ను నమ్మిన అనీశ్ మొదట రూ.40 వేలు పెట్టుబడి పెట్టడంతో అనుకున్నట్లుగానే 9500 లాభం చూపించాడు. దీంతో మరల రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇలా తెలిసిన వారు, బంధువుల వద్ద నుంచి మొత్తం రూ.1.3 కోట్ల వరకు వసూలు చేశాడు. ముందే చెప్పినట్లు లాభాలు ఇవ్వకపోవడంతో 13మంది బాధితులు నిలదీశారు. దీంతో వారికి చెక్కులు ఇచ్చాడు. కానీ అవి బౌన్స్ కావడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా తామంతా మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.