బేగంపేట్, మార్చి 16 : ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్కు ప్రభుత్వ పరంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్బోర్డ్ సీఈఓ ఖాజా మైనోద్దీన్, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాల పండుగలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. రంజాన్ నేపథ్యంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడుతారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి మసీదుల వద్ద ఉన్న కుక్కలను తరలించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజు మసీదులలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారని, వ్యర్థాలను వేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, రవికిరణ్, జలమండలి డైరెక్టర్ కృష్ణ, జీఎం రమణారెడ్డి, హరిశంకర్, ఈఈ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గూడ్స్ వెహికిల్స్ నిర్వాహకులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం రాంగోపాల్పేట్ డివిజన్లోని రాణిగంజ్లో నిర్వహించిన మినీగూడ్స్ వెహికిల్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటర్ వాహన చట్టాలు ఇబ్బంది కరంగా ఉన్నాయని ఆరోపించారు. పేద మధ్య తరగతి ప్రజలు ఈ వాహనాలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల నుంచి యూనియన్ను నిర్వహిస్తున్న నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు. స్థానిక వ్యాపారులతో సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.