ముషీరాబాద్/చిక్కడపల్లి, ఏప్రిల్ 15 : తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేలా నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ ఇంటి ఎదుట నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం వీఎస్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణాలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కరోనా సమయంలో 25 లక్షల మందిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత రాష్ర్టాలకు తరలించిందంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో బీజేపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వందల పెన్షన్ ఇస్తే తెలంగాణ వచ్చిన తరువాత రెండు వేల పెన్షన్ ఇచ్చి సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు.
నగరంలో శాశ్వతంగా మంచినీరు, కరెంటు సమస్యను పరిష్కరించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇసుక, ఇటుక పడితే అక్కడే వాలిపోతున్నారని, ఇళ్ల నిర్మాణాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు విబేధాలను పక్కన పెట్టి సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పరిశీలకుడు దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ పోరాటాలకు వేదికగా నిలిచిన ముషీరాబాద్ నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు విబేధాలు మరిచి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత రాంబాబు యాదవ్, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, ముఠా జయసింహ, రావులపాటి మోజస్, దామోదర్రెడ్డి, ఆర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం 18కోట్లఉద్యోగాలివ్వాలి
ఏప్రిల్ 15 : కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నగర ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాని హామీ ఇచ్చారు. దాని ప్రకారం గడిచిన 9 సంవత్సరాల్లో 18కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కానీ 18వేల ఉద్యోగాలు ఇవ్వాలని బండి సంజయ్ ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రంలో నిరుద్యోగ మిలియన్మార్చ్ చేస్తాడని మండిపడ్డాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ మనందరిలో స్ఫూర్తిని నింపాడన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.