Sunstroke | ఖమ్మం : భానుడి ఉగ్రరూపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతూ చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనానికి అంతరాయం సృష్టిస్తున్నాడు. 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న భానుడి భగభగలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉష్ణతాపాన్ని తట్టుకోవడం.. వడదెబ్బ నుంచి రక్షణ పొందడం తప్పనిసరి. ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు నిత్యం ఎండలోనే పనులు చేయడం, ప్రజలు వివిధ పనుల నిమిత్తం పొద్దంతా ఆరుబయటే పని చేయడం వల్ల ఎండ వేడితో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్కు గురై నిస్సత్తువకు గురవుతుంటారు. ఇలాంటి క్రమంలో ఎప్పటికప్పుడు నీరు తాగితూ.. చల్లని పదార్థాలు తీసుకుంటే శరీరానికి సమతుల్యం పాటించినట్లు అవుతుంది. వేసవిలో చాలా మంది గర్భిణులు, బాలింతలు నీళ్లు తాగడానికి ఇష్టపడరు. వారిలో నీటి సామర్థ్యం తగ్గిపోయి త్వరగా నీరసించిపోవడం.. బాలింతలకు పాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక దశలో స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇటువంటప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాపాయం సంభవించవచ్చు.
వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చాలా మంది విహార యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు ఉంటాయి. వీటికి కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఎందులో వెళ్లినా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు ఉదయం 11 గంటలలోపు గమ్యం చేరే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. రాత్రి వేళల్లో అయితే ఇంకా మంచిది. ప్రయాణాల్లో ఎక్కువగా మంచినీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగుతూ ఉండాలి.
శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు శారీరపరమైన, నాడీ పరమైన సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ‘వేడి’ శరీరంలోని ‘ఉష్ణ సమతుల్యత’ను కాపాడే చర్మం ద్వారా చెమట రూపంలో బయటకు పంపబడుతుంది. కానీ.. శరీరం అధిక ఉష్ణోగ్రతకు లేదా డీ హైడ్రేషన్కు గురైనప్పుడు రక్షణ మార్గాలైన చర్మం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. దీంతో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా అధిక స్థాయికి చేరుతుంది. దీనినే వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అంటారు.
అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడిబారటం, దప్పిక ఎక్కువ కావడం, వాంతులు కావడం, నీరసం, దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం, కన్ఫ్యూజన్, చిరాకు, ఉన్న స్థలము, సమయం తెలియకపోవడం, భ్రమలతో కూడిన ఆలోచనలు కలగడం, చివరిగా స్పృహ కోల్పోవడం (తెలివి తప్పడం).
చిన్న పిల్లలు, అత్యధిక వయస్సు ఉన్న వృద్ధులు, క్రీడాకారులు, రోజువారీ కూలీలు, శ్రమజీవులు, ఎక్కువగా ఆరుబయట పనిచేసేవారు.
వేసవిలో సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండే విధంగా చూసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనే తీసుకోకూడదు. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలో పటికబెల్లం కలిపి తీసుకోవాలి. కొబ్బరినీళ్లు కొంచెం కొంచెం సేవించాలి. వదులైన తెల్లని దుస్తులు ధరించాలి. తలపై టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదా గొడుగు వెంట తీసుకెళ్లాలి. కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. దాహం వేసినప్పుడు నీటినే తాగండి. శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. నిమ్మరసం, మజ్జిగ, చెరకు రసం మేలు చేస్తాయి.
వడదెబ్బకు గురైతే అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు. మొదటగా వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి. బిగుతుగా ఉన్న వస్ర్తాల్ని విప్పాలి. శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి. వ్యక్తి చుట్టూ గుంపుగా పోగైన వారిని దూరంగా ఉంచాలి. బట్టను చల్లని నీటిలో ముంచి శరీరానికి బాగా అద్దాలి. ఉప్పు కలిపిన చల్లని నీరు, మజ్జిగ, గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు తాగించాలి. ఇలా చేయడం వల్ల బాధితుడి శరీరంలోని వేడి తగ్గే అవకాశం ఉంటుంది. పాక్షిక అపస్మారక స్థితిలో లేదా పూర్తిగా స్పృహ తప్పినట్లుగా కనిపిస్తే అతడు పడుకున్న బెడ్పై కాళ్లవైపు ఎత్తైన దిండు అమర్చి శరీర పైభాగం కంటే పాదాలు ఎత్తుగా ఉండేలా చూడాలి. డాక్టర్ సలహా మేరకు 500 మిల్లీ గ్రాముల పారాసిటమాల్ మాత్రను ఇవ్వాలి. లేదా 300 మి.గ్రా పారాసిటమాల్ను ఇంజక్షన్ రూపంలో తప్పకుండా ఇవ్వాలి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తుంది.