న్యూఢిల్లీ : అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం (యూపీఎఫ్) అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని (New Study) చెబుతుంటారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొన్నేండ్లుగా పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే అన్ని రకాల ప్రాసెస్డ్ ఆహారాలు ప్రమాదకరం కాదని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.
అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను పూర్తిగా పక్కనపెట్టాల్సిన పనిలేదని, వీటి వినిమయం పరిమితంగా ఉండాలని, తాజాగా, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధ్యయన సహ రచయిత హింజ్ ఫ్రిలింగ్ వెల్లడించారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల్లో జంతు సంబంధ ఆహారోత్పత్తులు, కృత్రిమ, చక్కెరతో కూడిన పానీయాలను పూర్తిగా పక్కనపెట్టాలని అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ ప్రాసెస్డ్ ఆహార పదార్ధాలు క్యాన్సర్, హృద్రోగ ముప్పును పెంచుతాయని హెచ్చరించింది. అతిగా ప్రాసెస్ చేసిన బ్రెడ్స్, సిరిల్స్, మొక్కల సంబంధిత ప్రత్యామ్నాయాల నుంచి ముప్పు తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి ఉత్పత్తుల్లో ఫైబర్ ఉండటం మూలంగా ముప్పు తక్కువగా ఉండవచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన రేనాల్డ కర్డొవ తెలిపారు. ఏమైనా తాజా, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలనే వినియోగదారులు ఎంపిక చేసుకోవాలని ఈ అధ్యయనం వెల్లడించింది.
Read More :