Type 2 Diabetes | పిల్లల్లో ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన టైప్-2 మధుమేహం ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శారీరక చలనం తగ్గడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరగడం, ఊబకాయం అధికమవడం తదితర జీవనశైలి మార్పులు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం రావడం వల్ల తక్షణ ఆరోగ్య సమస్యలతోపాటు భవిష్యత్తులో గుండె, మూత్రపిండాలు, నరాలు, కంటి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టైప్-2 మధుమేహం కేవలం చక్కెర ఎక్కువగా తినడం వల్లే వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే అసలు సమస్య అది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఆహారంలో అధిక కార్బోహైడ్రేట్లు, తక్కువ ఫైబర్, తక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు ఆ ఆహారం చివరికి గ్లూకోజ్గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీంతో కాలక్రమేణా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది.
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, పిల్లలు తీసుకునే అనేక ప్యాకేజ్డ్ ఆహారాల్లో దాగి ఉన్న చక్కెరలు. ఆరోగ్యకరమని ప్రచారం చేసే ఫ్లేవర్డ్ యోగర్ట్లు, బ్రేక్ఫాస్ట్ సిరియల్స్, ప్యాకేజ్డ్ మిల్క్షేక్స్, బిస్కెట్లు, కెచప్ వంటి ఉత్పత్తుల్లో కూడా గణనీయమైన మోతాదులో చక్కెర ఉంటుంది. దీంతో పిల్లలు తెలియకుండానే వారి శరీరం భరించగల సామర్థ్యాన్ని మించి గ్లూకోజ్ను తీసుకుంటున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, పిల్లల మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. తరచూ ప్రాసెస్డ్ ఫుడ్స్, తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ తగ్గిపోతుంటాయి. ఈ హెచ్చుతగ్గులు పిల్లల్లో చిరాకు, అసహనం, అతిచురుకుదనం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పిల్లల్లో టైప్-2 మధుమేహం ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అధిక దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, అసాధారణ అలసట, చూపు మసకబారడం, చిన్న గాయాలు నెమ్మదిగా మానడం, తరచూ ఆకలి వేయడం వంటి సంకేతాలను తల్లిదండ్రులు గమనించాలి. ముఖ్యంగా మెడ, చంకల చుట్టూ నల్లని మచ్చలు కనిపిస్తే అది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమస్యను నివారించడానికి పిల్లల ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ప్రోత్సహించాలి. తీపి పానీయాలు, జంక్ ఫుడ్, అధిక చక్కెర కలిగిన స్నాక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలి. సమతుల ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు ఉండేలా చూడాలి. శారీరక చలనం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు రోజుకు కనీసం ఒక గంటపాటు శారీరక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రీడలు ఆడటం, సైకిల్ తొక్కడం, నృత్యం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడకకు వెళ్లడం వంటి కార్యకలాపాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
స్క్రీన్ టైమ్ను నియంత్రించడం కూడా అవసరం. టెలివిజన్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా చూసి, బయట ఆటలు ఆడేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. ఇది శారీరక చలనాన్ని పెంచడమే కాకుండా ఊబకాయం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహానికి దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే సమతుల ఆహారం, ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహం సమస్య కేవలం చక్కెర డబ్బాతో ప్రారంభం కాదు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్ ఆహారాలు, దాగి ఉన్న చక్కెరలు అధికంగా ఉండే బాల్య ఆహార విధానమే అసలు ప్రమాదం. సిరియల్స్, వైట్ బ్రెడ్, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్, తీపి పానీయాలు రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను పదేపదే పెంచి, టైప్-2 మధుమేహానికి మార్గం సుగమం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.