Health News | వానకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్లాంటి విషజ్వరాలు విజృంభిస్తుంటాయి. పాలిచ్చే తల్లులు, బాలింతలకు ఈ తరహా రుగ్మతలు వస్తే ఎలాంటి మందులు వేసుకోవాలి, ఎలాంటి మందులు వేసుకోకూడదు. జ్వరంతో బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
– ఓ పాఠకురాలు
మందులను ఏ,బీ,సీ,డీ,ఎక్స్ వర్గాలుగా విభజిస్తారు. ఎక్స్ రకాలను గర్భిణులు, బాలింతలకు అసలు ఇవ్వం. ఏ రకాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. బీ కూడా ఫర్వాలేదు. సీ రకాన్ని మరీ అవసరమైతేనే ఇస్తాం. డీ రకం తల్లి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వాలి. ఇవన్నీ తెలియాలంటే కనీసం ఎంబీబీఎస్ చదివి ఉండాలి. కాబట్టి, బాలింతలకు జ్వరం వస్తే తప్పకుండా డాక్టరు దగ్గరికే వెళ్లాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వేసుకోకూడదు. టెట్రాసైక్లిన్ గ్రూపులకు సంబంధించిన మందులు వాడకూడదు. రెండు రోజుల పాటు వంద జ్వరం ఉన్నా ఆమెకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు.
మూడో వంతు మాతృ మరణాలకు కారణం పురుడు తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లే. అందుకే, బాలింతలు, పాలిచ్చే తల్లులు కాచి చల్లార్చిన నీళ్లనే వాడాలి. బయటి ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది కనుక, తీసుకోకపోవడమే మంచిది. పాలిచ్చే తల్లులకు ఒకటిన్నర లీటర్ల నీళ్లు పాల రూపంలో బయటికి పోతాయి. అందుకే, నీళ్లు అధికంగా తాగాలి. వాళ్ల ప్లేట్లు, స్పూన్లు విడిగా ఉంచాలి. పాపాయి డైపర్లు మార్చే ముందు, మార్చిన తర్వాత కూడా శుభ్రంగా సబ్బుతో చెయ్యి కడుక్కోవాలి. సమూహాలకు దూరంగా ఉండటం ద్వారా వైరల్ ఫీవర్లను కట్టడి చేయవచ్చు. బాలింత గదిలోకి అందరూ వెళ్లకపోవడమే మంచిది. దీని ద్వారా కూడా ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. ఓపిక ఉందీ అనిపిస్తే ఏ జ్వరం అయినా సరే.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చు. పాపాయికి కూడా జ్వరం రాకుండా ఉండేందుకు.. మాస్క్ పెట్టుకోవాలి. పొరపాటున తుమ్మినా, దగ్గినా
చేతులు కడుక్కున్నాకే బిడ్డను తాకాలి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్