ఊబకాయం అంటే ఇన్నాళ్లూ శారీరక సమస్యగానే భావించేవారు. కానీ, అధిక బరువు వల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులతోపాటు మెదడు ఆరోగ్యానికీ ముప్పేనని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్లోని బెన్-గురియన్ యూనివర్సిటీ ఆఫ్ ది నెగెవ్ తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం.. అధిక బరువు వల్ల మెదడుకు కలిగే ముప్పును బయటపెట్టింది. ఊబకాయంతో ముడిపడి ఉన్న కొన్ని కొవ్వు అణువులు శరీర కణజాలాల నుంచి మెదడుకు చేరుతున్నాయట. అక్కడ మెదడు కణాల మధ్య సమాచార మార్పిడికి అంతరాయం కలిగించి.. డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలకు కారణం అవుతున్నాయట.
అల్జీమర్స్తో బాధపడుతున్న ఊబకాయుల ఎంఆర్ఐ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని తేల్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. పొట్ట భాగంలో అంతర్గత కొవ్వు పెరిగే కొద్దీ మెదడు పరిమాణం క్షీణిస్తుందని, మెదడు వృద్ధాప్యం వేగవంతం అవుతుందని వారు గుర్తించారు.
ఫలితంగా, వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతర ఆలోచనాత్మక లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అయితే, బరువు తగ్గడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చట. ‘గ్రీన్ మెడిటరేనియన్ డైట్’ లాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం ద్వారా మెదడు ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుందని అంటున్నారు. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకుంటే, మెదడు క్షీణత ప్రక్రియ కూడా మందగిస్తుందని చెబుతున్నారు.