చెన్నై : ఆన్లైన్ స్కామ్లపై (Cyber Fraud) పోలీసులు, ప్రభుత్వం ఎంత అప్రమత్తమై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నా సైబర్ నేరగాళ్లు చెలరేగుతూనే ఉన్నారు. అమాయకుల నుంచి ఆన్లైన్ వేదికగా అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. రోజుకో తరహా స్కామ్తో టోకరా వేస్తున్నారు. గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా వేలాది సైబర్ నేరాల కేసులు వెలుగుచూస్తున్నాయి. లేటెస్ట్గా పుదుచ్చేరికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ను స్కామర్లు నిలువునా ముంచారు. స్కామర్ల చేతిలో ఆయన ఏకంగా రూ. 43.9 లక్షలు పోగొట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడిని ఇటీవల ఫేస్బుక్ ద్వారా సిరియాకు చెందిన మహిళ సంప్రదించింది. బాధితుడిని పరిచయం చేసుకున్న మహిళ తాను కూడా రిటైర్ అయ్యానని భారత్లో 4.5 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నానని నమ్మబలికింది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తనకు సాయం చేయాలని కోరింది. ఆపై ఓ పార్సిల్ ద్వారా తాను పెట్టుబడి మొత్తాన్ని పంపానని మహిళ తెలిపింది. బాధితుడు ఆమెకు సాయం చేసేందుకు అంగీకరించడంతో రూటు మార్చిన కేటుగాళ్లు రిటైర్డ్ హెడ్మాస్టర్ను బోల్తా కొట్టించేందుకు స్కెచ్ వేశారు.
బాధితుడు పార్సిల్ రిసీవ్ చేసుకునే క్రమంలో పలువురు వ్యక్తులు తాము ఆర్బీఐ, భారత దౌత్య కార్యాలయ అధికారులమని, మధ్యవర్తులమని అంటూ సంప్రదింపులు జరిపారు. పార్సిల్ రిసీవ్ చేసుకునేందుకు కొంత మొత్తం మదుపు చేయాలని మభ్యపెట్టిన స్కామర్లు బాధితుడి నుంచి పలు లావాదేవీల ద్వారా రూ. 43.90 లక్షలు రాబట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులను నమ్మి ఎలాంటి లావాదేవీలూ జరపరాదని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
Read More :
Pradeep Sharma: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు.. పోలీసు ఆఫీసర్కు సుప్రీం బెయిల్