Obesity : ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నారని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి పెద్దల్లో ఊబకాయం రెట్టింపవగా, పిల్లల్లో నాలుగు రెట్లు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎత్తు, బరువు, వయసు ఆధారంగా పరిశోధకులు 3663 అధ్యయనాలను పరిశీలించి ఈ వివరాలు వెల్లడించారు. 2022లో 43 శాతం మంది పెద్దలు అధిక బరువుతో సతమతమవుతున్నారని అధ్యయనం స్పష్టం చేసింది.
పసిఫిక్, కరేబియన్, మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో అధిక బరువు, పోషకాహార లోపాలతో బాధపడే వారి రేటు అధికంగా ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది. 197 దేశాలకు గాను మహిళల్లో ఊబకాయంలో భారత్ 182వ స్ధానంలో ఉండగా, పురుషుల్లో 180వ స్ధానంలో నిలిచింది. భారత్ ఊబకాయంతో సతమతమవడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్యనూ ఎదుర్కొంటోంది.
2022లో బరువు తక్కువ ఉన్న పెద్దలు అత్యధిక సంఖ్యలో భారత్, చైనా, జపాన్ (మహిళలు), ఇండోనేషియా, ఇథియోపియా, బంగ్లాదేశ్లున్నాయి. ఈ నివేదిక ప్రకారం ఊబకాయంతో బాధపడే పెద్దలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా, ఇండియా ముందువరసలో ఉన్నాయి.అటు ఊబకాయం, ఇటు పోషకాహార లోపంతో బాధపడే వారు భారత్లో అధికంగా ఉండటం పెను సవాళ్లను విసురుతోంది. ఊబకాయాన్ని నిరోధిస్తూ బరువు తక్కువ ఉండటం వంటి లోపాలను అధిగమించేందుకు పోషకాహారం అందరికీ అందుబాటులో ఉండటమే కీలకమని పరిశోధకులు తేల్చిచెప్పారు.
Read More :