న్యూఢిల్లీ : 14 గంటల పాటు ఉపవాసం ఆపై 10 గంటల్లో రోజుకు సరిపడా ఆహరం తీసుకునే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) ట్రెండ్ ఇప్పుడు ప్రబలుతోంది. ఈ పద్ధతిని పాటించడం ద్వారా కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా బరువు తగ్గుతూ రక్తపోటు నియంత్రణలో ఉండటం వంటి పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. ఇక తాజా అధ్యయనంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు మూడ్ మెరుగవుతుందని, ఆకలి బాగా వేయడంతో తగినంత ఆహారం తీసుకోగలుగుతారని వెల్లడైంది. కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయన వివరాలను యూరోపియన్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ ముందుంచారు.
37,545 మందిపై ఈ అధ్యయనం నిర్వహించామని బృందంలో ఒకరైన సారా బెర్రీ తెలిపారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించిందని బెర్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాల కోసం కఠిన నియంత్రణలు పాటించాల్సిన అవసరం లేదని రోజులో పది గంటల సమయంలో భోజనాలను ముగించడం మిగిలిన 14 గంటలు ఏమీ తినకుండా ఉంటే చాలని అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. ఈ విధానాన్ని చాలా మంది అనుసరించే వెసులుబాటు ఉంటుందని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎనర్జీ లెవెల్స్, మూడ్, ఆకలి వంటివి మెరుగయ్యాయని తేలింది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను క్రమం తప్పకుండా పాటించిన వారిలో ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ డైట్ మోడల్ను అనుసరించడంలో నిలకడ లేని వారిలో అలసట, అలజడి, విపరీతమైన ఆకలి వంటి లక్షణాలు కనిపించాయని గుర్తించారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కు ముందు ఎక్కువ సమయం తినే వారిలో ఈ డైట్ పద్ధతిని పాటించిన అనంతరం అద్భుత ఫలితాలు రావడం గమనార్హం. మనం ఎంత తిన్నామనే దానికంటే ఎప్పుడు తిన్నామనేది కీలకమని, పది గంటల్లోనే ఆ రోజుకు తీసుకునే ఆహారాన్ని ముగించడమనేది ఆరోగ్యం విషయంలో సానుకూల ఫలితాలు ఇస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకుడు కేట్ బర్మింగ్హాం తెలిపారు.
Read More :