ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు అనేక రకాల కూరగాయలను డైట్లో భాగం చేసుకుంటారు. రకరకాల కూరలు వండుకొని తింటుంటారు. అయితే, వంట చేసేక్రమంలో.. కొన్ని కూరగాయల్లో పోషకాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిని పచ్చిగా తినడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
రెడ్ బెల్పెప్పర్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అయితే, అధిక వేడికి గురైనప్పుడు ఇందులోని ఆస్కార్బిక్ ఆమ్లం స్థాయులు గణనీయంగా పడిపోతాయి. ఉడకబెట్టినా, ఆవిరి చేసినా.. పోషకాలన్నిటినీ కోల్పోతుంది. అందుకే, రెడ్ బెల్పెప్పర్ను పచ్చిగా తిన్నప్పుడే.. ఇందులోని విటమిన్ సి గరిష్ఠస్థాయిలో లభిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ కూడా శరీరానికి అందుతాయి. రెడ్ బెల్పెప్పర్స్ను సలాడ్ రూపంలో తీసుకోవడమే మంచిది.
బ్రొకోలీలో యాంటి ఇన్ఫ్లమేటరీ, కీమోప్రొటెక్టివ్ లక్షణాలు కలిగిన ‘మైరోసినేస్’ అనే ఎంజైమ్ ఉంటుంది. అధిక వేడిలో ఈ ఎంజైమ్ నిష్క్రియంగా మారిపోతుంది. దాంతో, శరీరానికి బ్రొకోలీ సుగుణాలు అందకుండా పోతాయి. వండిన బ్రొకోలీతో పోలిస్తే.. పచ్చిదాంట్లోనే 10 రెట్లు ఎక్కువగా సల్ఫోరాఫేన్ అనే యాంటి ఆక్సిడెంట్ లభిస్తుంది.
వెల్లుల్లిలో యాంటి ఆక్సిడెంట్లు, సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. అయితే, వెల్లుల్లిని వేడి చేయడం వల్ల.. ఇందులోని అల్లిసిన్, ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు పాక్షికంగా నాశనం అవుతాయి. కాబట్టి వెల్లుల్లి పూర్తి ప్రయోజనాలు అందాలంటే.. దీనిని పచ్చిగా తినడమే మంచిది. అయితే, పచ్చి వెల్లుల్లి కొంతమందిలో కడుపుని చికాకు పెడుతుంది. కాబట్టి, తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం అవసరం.
ఎక్కువసేపు వేడి చేసినప్పుడు ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు దెబ్బతింటాయి. సాధారణ వంట పద్ధతుల్లోనూ కొన్ని ఫ్లేవనాయిడ్లు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి, పచ్చి ఉల్లిపాయలను సలాడ్లు, డ్రెస్సింగ్లలో తీసుకుంటే.. అధిక స్థాయిలో ఫైటోన్యూట్రియెంట్లు శరీరానికి అందుతాయి.