హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘావర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతోపాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్తోపాటు పోలీస్ ఉన్నతాధికారులతో రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆసారం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతోపాటు అన్ని ప్రక్రియల్లో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోచింగ్ సెంటర్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయెల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు.