High Blood Pressure | రక్తపోటు (హైబీపీ) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలలో ఒకటి. అయినప్పటికీ చాలామంది సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకునే సమయంలో మాత్రమే రక్తపోటును పరీక్షించుకుంటారు. అయితే ఒక్కసారి తీసిన బీపీ రీడింగ్పై మాత్రమే ఆధారపడటం సరైన నిర్ణయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు అసలు స్థాయిని తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా కొలవడం అవసరమని సూచిస్తున్నారు. ఆసుపత్రి లేదా వైద్యుల క్లినిక్లో కొలిచే రక్తపోటు కొన్నిసార్లు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. దీనికి ప్రధాన కారణం వైట్ కోట్ సిండ్రోమ్. కొంతమంది ఆసుపత్రి వాతావరణంలో ఆందోళన, భయం లేదా ఒత్తిడికి గురవుతారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా రక్తపోటు పెరిగి, సాధారణం కంటే ఎక్కువ రీడింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుంది.
ఈ కారణంగా సంవత్సరానికి ఒకసారి తీసిన ఒక్క రీడింగ్ ఆధారంగా ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడం కంటే, ఇంట్లోనే క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల నిజమైన సగటు రక్తపోటు స్థాయిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం 2-2-7 పద్ధతిని అనుసరించాలని సూచిస్తున్నారు. ఈ విధానంలో ఇంట్లో ఉపయోగించే ఆర్మ్ బ్లడ్ ప్రెజర్ మానిటర్తో ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు రక్తపోటు కొలవాలి. ఇలా వరుసగా ఏడు రోజుల పాటు నమోదైన అన్ని రీడింగ్లను రాసి, వాటి సగటును లెక్కించాలి. ఈ సగటు విలువే వ్యక్తి వాస్తవ రక్తపోటు స్థాయిని మరింత కచ్చితంగా తెలియజేస్తుంది.
ప్రతి రీడింగ్ను తేదీ, సమయంతోపాటు నమోదు చేసుకోవడం వల్ల వైద్యుడికి కూడా సరైన సమాచారం అందుతుంది. అవసరమైతే చికిత్స లేదా మందుల విషయంలో మరింత సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారిలో చాలామందికి తమకు ఈ సమస్య ఉందనే విషయం కూడా తెలియదని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ గుండె జబ్బులకు దారితీసే ప్రమాద కారకాలలో అత్యంత సులభంగా నియంత్రించగలిగే అంశమని పేర్కొంటున్నారు. అయితే దాన్ని నియంత్రించాలంటే ముందుగా దానిని గుర్తించడం అవసరం. అందుకే రక్తపోటును క్రమం తప్పకుండా కొలుస్తూ, స్థాయిలపై అవగాహన కలిగి ఉండడం దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.