మా దగ్గర రజస్వల అయితే తీపి పెడతారు. తొలి పదిరోజులూ కారం ఎక్కువగా లేని ఆహారమే ఇస్తారు. కారాలు తింటే మున్ముందు పొట్టలో నొప్పి వస్తుందని హెచ్చరిస్తారు. ఇదంతా నిజమేనా, అసలు అమ్మాయి రజస్వల అయినప్పుడు ఎలాంటి ఆహారం పెట్టాలి?
రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ, ఈ దశలో ఆడపిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది. అందుకే క్యాల్షియం, ఐరన్, విటమిన్-డి అధికంగా లభించే ఆహారాలు పెట్టాలి. మనం కూడా రజస్వల అయిన ఆడపిల్లలకు నువ్వుల ముద్ద పెడతాం. ఇది మంచిదే. నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
అమ్మాయి రజస్వల అయ్యాక తొలి ఆరు నెలలు సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్లు పొడవు పెరిగే సమయం అదే. ఆ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరిగిపోతుంటాయి. ఫలితంగా ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే, రజస్వల అయిన అమ్మాయికి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండేలా చూడాలి. లావు అయితే మాత్రం హార్మోన్లలో తేడా వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్