ముంబై : నగర పౌరులందరికీ నూటికి నూరు శాతం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు అందచేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముంబై నగరంలో శనివారం ఉదయంతో 92,36,500 మందికి కొవిడ్-19 తొలి డోసు అందించి నూరు శాతం సింగిల్ డోస్ లక్ష్యాన్ని అధిగమించామని, నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అధికారుల సహకారంతో ఈ మైలురాయిని దాటామని బీఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తొలి దశలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని కొవిడ్-19 సెకండ్ డోస్ కూడా అర్హులైన వారంతా తీసుకోవాలని అధికారులు కోరారు. శనివారం మధ్యాహ్నానికి 59,83,452 మంది ముంబై వాసులు కొవిడ్-19 వ్యాక్సిన్ సెకండ్ డోసు తీసుకున్నారని వెల్లడించారు. అర్హులైన పౌరులందరూ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా సత్వరమే తీసుకోవాలని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్, అదనపు మున్సిపల్ కమిషనర్ సురేష్ కనాని కోరారు.