శరీర నిర్మాణంలో సహకరించే తొలి పోషకాలు పాలే. భారతదేశంలో పాలు ఆహారమే కాదు, పూజా ద్రవ్యం కూడా. అలా సాంస్కృతికంగానూ మన జీవితాల్లో విడదీయరాని భాగమైపోయాయి. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశానిదే ప్రథమ స్థానం. మనం గర్వించాల్సిన విషయం ఇది.
కొన్ని రకాలైన ఆహారాలతో కలిపి పాలు తీసుకోవద్దని ఆయుర్వేదం సూచిస్తున్నది. ఇలా చేస్తే పొట్టలో టాక్సిన్లు పుడతాయి. పుల్లటి పండ్లు, చేపలు, ఉప్పుతో కూడిన ఆహారాలతో పాలు తీసుకోకూడదు. తీపి-పులుపు, చేపల్లో ప్రొటీన్లు-పాలలో ప్రొటీన్లు, ఉప్పు-తీపి ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి. దీంతో పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది.
పాలు ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. పొద్దున్నే గోరువెచ్చటి పాలు తీసుకుంటే రోజంతా శక్తిమంతంగా ఉంటాం. పడుకునే ముందు తాగితే ప్రశాంతంగా నిద్రపోతాం. నిద్రలో నాణ్యతా పెరుగుతుంది. వ్యాయామం తర్వాత తీసుకుంటే కండరాలకు మేలు జరుగుతుంది. తిన్న తర్వాత పాలు తాగకపోవడమే మంచిది.
వయసు, ఆరోగ్యం, ఆహార అవసరాల మేరకు పాలు తాగాలి. శిశువులకు తల్లిపాలు మంచివి. చిన్నపిల్లలు రోజుకు రెండు మూడు కప్పుల నీళ్లు కలవని పాలు తాగితే సరిపోతుంది. నడి వయసు వారు కప్పు పాలలో పావుభాగం నీళ్లు కలుపుకోవాలి. వృద్ధులైతే సగభాగం నీళ్లు జోడిస్తే మంచిది.
ఎన్ని పోషకాలు ఉన్నా.. కొంతమంది పాలు పరిమితంగా తాగాలి. లాక్టోజ్ పడనివారు, పాలంటే అలర్జీ ఉన్నవారు, గెలాక్టోసీమియా, ఫినైల్కెటోనూరియా లాంటి వైద్యపరమైన పరిస్థితులు ఉన్నవారు పాలు తాగకూడదు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ శిశువులకు తల్లిపాలు మంచివే.
జంతువుల పాలు తాగని వారికి మొక్కలు, ఆకులు, గింజలు, ఇతర సప్లిమెంట్ల నుంచి తీసిన పాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలలో ఉండే పోషకాలు అందకపోతే ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటాయి. సాధారణ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
ఆయుర్వేదం ఆవుపాలతోపాటు మేకపాలూ శ్రేష్ఠమైనవని చెబుతుంది. గొర్రెపాలలో క్యాల్షియం, అత్యవసర పోషకాలు అపారం. ఒంటెపాలలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ. బర్రెపాలు మందం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో జడలబర్రె (యాక్) పాలు కూడా తాగుతారు. వీటిలో కొవ్వు, ప్రొటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి.
పాలలోని ప్రొటీన్ పరిమాణాన్ని బట్టి, ఎ1, ఎ2గా విభజిస్తారు. ఎ1 పాలలో ఎ1 బీటా కేసిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉంటుంది. ఎ2 పాలలో ఎ2 బీటా కేసిన్ ఉంటుంది. వీటిలో రెండోరకమే ఆరోగ్యకరమైంది అని అంతర్జాతీయ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. దేశీఆవుపాలు ఈ పరిధిలోకే వస్తాయి.