కరోనా ( corona ) అతలాకుతలం చేస్తున్నవేళ రోగనిరోధకశక్తి ( Immunity )ని పెంచుకొనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోడానికి ప్రాధాన్యం పెరిగింది. అయితే, చాలామంది సరైన ఆహారం తీసుకోకుండా ఇమ్యూనిటీ బూస్టర్లు, కషాయాలకే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేయడం సరికాదంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య. వైరస్ సోకినవారు, సోకనివారు ఎవరైనా సరే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ పదార్థాలు రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడుతాయనే దానిపై డాక్టర్ లక్ష్మయ్య ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఆ వివరాలు..
వైరస్ సోకినవారు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. కొవిడ్ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీస్ వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. పప్పు దినుసులు, చేపలు, చికెన్, మటన్ ఇతర మాంసాహారాల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇవికాకుండా పాలు, పెరుగు, గుడ్లు కూడా తీసుకోవచ్చు. వైరస్ సోకినవారు కాస్త ఎక్కువ మోతాదులో ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 60 గ్రాముల పప్పు తింటే కావాల్సిన ప్రొటీన్లు శరీరానికి సైప్లె అవుతాయి. వైరస్సోకిన వారైతే 60 నుంచి 100 గ్రాముల మధ్యలో తింటే మంచిది.
బ్యాలెన్స్డ్ డైట్లో పదిరకాల పుడ్ గ్రూప్స్ ఉంటాయి. పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పోషక ధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, నట్స్ అండ్ సీడ్స్, ప్యాట్స్ అండ్ ఆయిల్స్ ఇవన్ని ప్రతిరోజూ మన ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. వాటిలో కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ప్రూట్స్, వెజిటేబుల్స్లో ఆంటీక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడుతాయి.
చాలామందికి విటమిన్ డీ, బీ 12, అనీమియా, ఐరన్, జింక్ లోపం ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవిలేకుండా చూసుకోవాలి. మంచి ఆహారం, డాక్టర్ల సలహా తీసుకొని అవసరమైన ముందు జాగ్రత్తలు ఎంతో మేలు చేస్తుంది.
మంచి ఆహారం తీసుకునేవారికి వైరస్, బ్యాక్టీరియా, ఇన్షెక్షన్స్ అనేవి మల్టీపుల్ కావు. వైరస్ శరీరంలోకి ఎంటర్ కాగానే దాన్ని అడ్డుకొనే యాంటీబాడీస్ను తయారుచేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారం ఉపయోగపడుతుంది. రోగ లక్షణాలు రాకుండా, వాటి ప్రభావం మనమీద పడకుండా చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజూ పండ్లు (100 నుంచి 150 గ్రాములు), కూరగాయాలు (250 గ్రాముల నుంచి 300 గ్రాములు) మొత్తం కలిపి 400 గ్రాములు తీసుకోవాలి. ఇవి కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే డ్రైప్రూట్స్, నట్స్ మొదలైనవి ఎక్కువగా తినాలి.
ఇమ్యూనిటీ బూస్టర్లను డాక్టర్ సలహా, సూచనల మేరకు వాడితే మంచిది. కాకపోతే ఇదే తొలి ఆప్షన్ కాకూడదు. ముందు సహజంగా లభించే ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకే ప్రాధాన్యమివ్వాలి. మార్కెట్లో దొరికే బూస్టర్లు ఆశించినస్థాయిలో పని చేయకపోవచ్చు.
వైరస్ను జయించామంటే దానర్థం శరీరంలో వైరస్ను తట్టుకునే యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టే. అందుకని పైన చెప్పినట్టు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
ఎక్కువ ప్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఆపిల్ ఒక్కటే కాకుండా గువా (జామకాయ) తీసుకోవచ్చు. గువా ధర కూడా చాలా తక్కువ. దానిలో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బాదం, పిస్తాలతో పోలిస్తే కంది, పెసరపప్పులోనూ మంచి ప్రొటీన్స్ ఉంటాయి.
బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం లాంటి ఫిజికల్ ఆక్టివిటీ చేయడం చాలా ముఖ్యం. డయాబెటిస్, ఒబేసిటీ, హైపర్టెన్షన్ ఉన్నవారు సాధారణ ఫిజికల్ ఆక్టివిటీ చేయడం అవసరం. దీనిద్వారా ఉపశమనంతోపాటు వారికి కావాల్సిన రోగనిరోధక శక్తి లభిస్తుంది.
ప్రజారోగ్య నిపుణుడిగా నీనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కషాయాలు తాగకూడదనే చెప్తా. ఎందుకంటే కషాయాలతో లివర్ మీద చాలా ప్రభావం పడుతుంది. కషాయాలు అనేవి మేలు చేస్తాయని ఎక్కడా నిరూపితం కాలేదు. కాకపోతే మన వంటింట్లో ఉండే పసుపు, అల్లం, లవంగాలు, దాల్చినచెక్క మొదలైనవి తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ వాటితో కషాయాలు చేసుకొని తాగడం మంచిది కాదు.
విటమిన్లు ఏ, సీ, బీ, పొటాషియం ఉండే బొప్పాయి, ఆపిల్, గ్రేప్స్, మ్యాంగో తినడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటితోపాటు సిట్రాన్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు, సీజనల్గా లభించే పండ్లు, పెరుగు, మాంసం, చేపలు ఇవ్వన్నీ కూడా ఉపయోగపడుతాయి.
ఇవి కూడా చదవండి..
Immunity boosters : కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి చాలా అవసరం
pulse oximeter : పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా ఉపయోగించాలి?
వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండే వాళ్లు తినాల్సిన ఆహారపదార్థాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?