జోరుగా వానలు కురుస్తున్నాయి. దాంతో దోమల బెడద మొదలైంది. వీటి కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మనల్ని చుట్టుముట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మన శరీరం వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండటం ఒక్కటే ముఖ్యం. మరి వ్యాధి నిరోధక శక్తిని ఈ వానాకాలంలో పొందాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు ఏఏ ఆహారపదార్థాలు మనకు ఉపయోగపడతాయి..? అనే విషయాలు తెల్సుకుందాం.
నిమ్మకాయ
నిమ్మకాయ రసంలో సీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. నిమ్మ రసం వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా జీవక్రియ రేటు కూడా మెరుగవుతుంది. ఎముకలను బలంగా ఉంచేందుకు పేతం చేయడానికి కూడా నిమ్మరసం చాలా చక్కగా సహాయపడుతుంది.
వెల్లుల్లి
ఔషధ గుణాలు ఎక్కువగా లభించే వెల్లుల్లిని తినడం వల్ల శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్ వ్యాధులు దరిచేరవు. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.
పాలకూర
అన్ని రకాల ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా పాలకూరను వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. వీటిలో బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉండి మన శరీరానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తాయి. అదేవిధంగా విటమిన్ ఏ , సీ, ఈ కూడా తగిన మోతాదుల్లో దొరుకుతాయి.
నట్స్
జీడిపప్పు, బాదం వంటి ఇతర గింజలలో రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకని వానాకాలంలో నట్స్ ఎక్కువగా తీసుకునేలా చూడాలి.