న్యూఢిల్లీ : దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వచ్చే వారం భారత్ అరుదైన మైలురాయిని చేరనుంది. వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి దేశంలో వంద కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తవుతుందని ఇది అద్భుత విజయమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నాటికి 96.7 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తవగా ఒక్కరోజులో ఇప్పటివరకూ 30.25 లక్షల డోసుల పంపిణీ జరిగింది. వీటిలో యాభై శాతం పైగా సెకండ్ డోస్ కావడం గమనార్హం.
ఇప్పటివరకూ దేశంలో 18 ఏండ్లు పైబడిన జనాభాలో దాదాపు 73 శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకోగా, 30 శాతం మంది టీకా రెండు డోసులూ తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరమైంది. అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వానికి తాము 22 కోట్ల కొవిషీల్డ్ డోసులు సరఫరా చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ వెల్లడించగా భారత్ బయోటెక్ ఆరు కోట్ల కొవాగ్జిన్ డోసులను సమకూరుస్తోంది. ఇక 60 లక్షల జైడస్ క్యాడిలా జైకోవ్-డీ టీకా డోసులు కూడా ఈ నెలలో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.