(Diabetes Day) మధుమేహం.. డయాబెటిస్.. చక్కెర వ్యాధి.. ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్యాధి అందరిలో సాధారణమైపోయింది. వ్యాధి ఉన్న విషయం కూడా తెలియకుండానే మనిషికి సోకుతుండటం దీని ప్రత్యేకత. స్వీట్ పాయిజన్ వంటిది. చక్కెర వ్యాధి.. ఈ వ్యాధికి పేరులోనే చక్కెర. దీని ఫలితం మాత్రం మొత్తం చేదు. మనకు తెలియనంతగా సోకుతున్న మధుమేహం వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1991 నుంచి ప్రప్రంచ ఆరోగ్య సంస్థ ఏటా నవంబర్ 14 వ తేదీన ప్రపంచ మధుమేహ దినం నిర్వహిస్తున్నది. ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్న ఫ్రెడరిక్ బేంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మధుమేహ దినం పాటిస్తున్నారు.
ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ మారిపోయింది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 8 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. భారత్లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది. ఈ వ్యాధిని నివారించడం అంత తేలిక కానప్పటికీ.. కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా సమర్థంగా ఎదుర్కోవచ్చునని సెలవిస్తున్నారు వైద్య నిపుణులు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజమే డయాబెటిస్. ఈ సమస్య కారణంగా అతి మూత్రం, దాహం ఎక్కువగా వేయడం, అతిగా ఆకలి వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రీ-డయాబెటీస్ దశలో రోగి వైద్యులను సంప్రదిస్తే వ్యాధి దరిచేరకుండా నివారించవచ్చు. అయితే, వ్యాధి లక్షణాలు 50 శాతం రోగుల్లోనే కనిపిస్తాయి. మిగిలిన వారిలో కేవలం వైద్య పరీక్షల ద్వారానే గుర్తించవచ్చు. ప్రీ-డయాబెటీస్ దశలో గుర్తించేందుకు ఆరు నెలలకు ఒక్కసారైన ప్రీ-డయాబెటీస్ పరీక్షలు చేయించు కోవాలి. రక్తంలో చక్కెర పెరిగి చిక్కగా మారి మూత్రపిండాలు, కాళ్లు, నరాలు, గుండెకు సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉంటాయి.
చక్కెర వ్యాధి రోగుల పాదాల్లో రక్తప్రసరణ క్షీణించి నరాల స్పర్శ తగ్గడం వల్ల గాయాలు ఏర్పడుతాయి. అవి మానకపోవడం వల్ల పాదాలకు సమస్యలు ఏర్పడుతాయి. గోరువెచ్చటి నీరు సబ్బుతో నిత్యం పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు మాంసాహారాలను పూర్తిగా మానడం చాలా మంచిది. అధిక కార్బోహైడ్రేట్లను ఇచ్చే కూరగాయలను తినాలి. బీన్స్, చిక్కుళ్ళు , తియ్యటి బంగాళాదుంపలు, క్వినోవా వంటి తృణధాన్యాలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి. అరటిపూవు, అరటికాడ, క్యాబేజీ, లేత వంకాయ, బెండ, పొట్ల, దొండ, బీర, చిక్కుడు, మునగాకులను ఆహారంలోకి తీసుకోవచ్చు. ఇక ఆకుకూరల్లో పొన్నగంటికూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర వంటివి తినొచ్చు. బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు తింటుండాలి. క్యారట్, బీట్ రూట్ నెలకు కనీసం రెండుసార్లు తినేలా చూసుకోవాలి. ఒమేగా 3 అధికంగా ఉండే సాల్మన్ చేపలను నెలకు ఒకసారైనా తినాలి. నిత్యం భోజనం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాలు నడక అలవాటుచేసుకోవాలి.
డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవడానికి శాఖాహారమే బెస్ట్ అని అమెరికా డయాబెటీస్ అసోసియేషన్ తేల్చింది. సో మీరూ ట్రై చేయండి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండి.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..